90 రోజులైంది..ఆ జ్ఞాపకాలు ఎప్పటికీ!

Sushant Singh sister shares new song on 90 days of his death - Sakshi

సాక్షి,ముంబై: బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అకాలమరణం కుటుంబంలో తీరని విషాదాన్ని మిగిల్చింది. అనుమానాస్పద పరిస్థితుల్లో ఈ లోకాన్ని వీడి మూడు నెలలు కావస్తున్నా అతని జ్ఞాపకాలు మాత్రం ప్రతీక్షణం సుశాంత్ తోబుట్టువులను వెన్నాడుతున్నాయి. అనుక్షణం భావోద్వేగానికి  లోనవుతున్నారు. ఈ నేపథ్యంలో సుశాంత్ సోదరి శ్వేతాసింగ్  తన సోదరుడు తమను వీడి 90 రోజులైన సందర్భంగా ఒక  కొత్త పాటను సోషల్ మీడియాలో షేర్ చేశారు. 

సుశాంత్ భౌతికంగా దూరమై 90 రోజులు అయింది. మన జీవితాల్లో సుశాంత్ జ్ఞాపకాలు ఎప్పటికీ పదిలమే. ఉనికిని గౌరవించే సూచికంగా ఈ పాట అంకితం అని శ్వేతా సింగ్ కీర్తి పోస్ట్ చేశారు.  జోష్-ఏ-జహాన్ పేరుతో దీన్ని విడుదల చేశారు. సుశాంత్ తమతో గడిపిన మధుర క్షణాలు, ఇతర మరపురాని, ఉద్వేగభరిత క్షణాలు, వ్యాయామం చేస్తున్న వీడియో క్లిప్‌ల మేళవింపుతో ఈ వీడియోను రూపొందించారు. ఈ పాటకు ఆదిత్య చక్రవర్తి సాహిత్యాన్నిఅందించగా, శుభంసుందరం స్వరపర్చారు. నీల్ ఘోష్, అర్పిత చక్రవర్తి ఆలపించారు. అంతకుముందు సుశాంత్ కలలో ఒకటైన చెట్లను నాటడంపై స్పందించిన అభిమానులు మొక్కలు నాటుతున్న వీడియోను శ్వేతా షేర్ చేశారు. ప్లాంట్స్ ఫర్ ఎస్ఎస్ఆర్ పేరుతో మొక్కలు నాటాలని కోరారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా లక్షకు పైగా చెట్లను నాటడంతో ఫాన్స్ కు ఆమె ధన్యవాదాలు తెలిపారు. 

కాగా జూన్ 14న సుశాంత్ తన ముంబై ఇంటిలో ఉరివేసుకుని చనిపోవడం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. సుశాంత్ మరణానికి స్నేహితురాలు రియా చక్రవర్తి కారణమంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆ తరువాత ఈ కేసులో బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ ఎంట్రీ మొదలు రోజుకో పరిణామంతో అనేక మలుపులు తిరుగుతూ చివరికి రాజకీయ సెగలు రేపింది. మాదక ద్రవ్యాల కోణం వెలుగు చూడటంతో ఎన్‌సీబీ రియాను, ఆమె సోదరుడిని అరెస్ట్  చేసిన సంగతి తెలిసిందే. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top