ఇటీవల హీరోయిన్ నిత్యా మీనన్ షాకింగ్ కామెంట్స్ చేశారు. పిల్లలను కనాలంటే పెళ్లి అవసరం లేదని అన్నారు. అది మన వ్యక్తిగత నిర్ణయమని స్పష్టం చేశారు. ప్రస్తుతానికి తాను పెళ్లి చేసుకోకుండానే హ్యాపీగా ఉన్నానని తెలిపింది. తాజాగా నిత్యామీనన్ బాటలో స్టార్ నటుడి కుమార్తె నిలిచింది. ఇప్పటికే నిత్యామీనన్ చేసిన కామెంట్స్ వైరల్ కావడంతో.. తాజాగా నటుడు సత్యరాజ్ కూతురు దివ్య చేసిన వ్యాఖ్యలు కోలీవుడ్లో హాట్టాపిక్గా మారాయి.
వివాహ వ్యవస్థ పట్ల తనకు గౌరవం ఉందని దివ్య తెలిపింది. వ్యక్తిగతంగా తాను పెళ్లి బంధాన్ని విశ్వసించనని పేర్కొంది. కేవలం మంగళసూత్రం కట్టడం వల్లనో లేదంటే ఉంగరాలు మార్చుకోవడం వల్లో ఇద్దరు వ్యక్తుల మధ్య బంధం బలపడుతుందని నేను భావించడం లేదని వెల్లడించింది. ఇద్దరు వ్యక్తులు పరస్పర అంగీకారం, ప్రేమతో కలిసి జీవించవచ్చని దివ్య స్పష్టం చేసింది. కలిసి జీవించడానికి పెళ్లి అనే సామాజిక ముద్ర, ధృవీకరణ పత్రం అవసరం లేదంటూ దివ్య సత్యరాజ్ కుండ బద్దలు కొట్టింది.


