టాలీవుడ్ కింగ్ నాగార్జున తన వందో సినిమాను ఎంతో ప్రత్యేకంగా రూపొందిస్తున్నారు. తమిళ దర్శకుడు కార్తీక్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం పేదరికం నుంచి సంపన్నుడిగా ఎదిగిన ఫార్ములా కథతో సాగనుందని తెలుస్తోంది. ఇందులో నాగ్ ఒక షేడ్లో 25 ఏళ్ల యువకుడిలా కనిపించనున్నారని సమాచారం. దాని కోసం చిరంజీవి ఆచార్యలో, రజనీకాంత్ కూలీలో వాడిన అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగిస్తున్నారట. అంటే దాదాపు శివ సినిమాలో నాగార్జున ఎలా కనిపించారో, అదే వింటేజ్ లుక్ను ఈ పాత్రలో మళ్లీ చూపించనున్నారు.
ఆచార్య వచ్చిన సమయంలో ఈ టెక్నాలజీ ఖరీదైనది. కానీ ఇప్పుడు ఏఐ అందుబాటులోకి రావడంతో ఖర్చు తగ్గింది, దాంతో వాడకం చాలా సులభమైంది. ఇక దీంతో నాగార్జున వందో సినిమా మరింత ప్రత్యేకంగా మారే అవకాశం ఉంది. కాగా ఈ చిత్రంలో టబు ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. నాగార్జున-టబు జంట 28 ఏళ్ల తర్వాత మళ్లీ తెరపై కనిపించనుంది. గతంలో వీరిద్దరూ నటించిన నిన్నే పెళ్ళాడతా బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. చివరిగా వీరు ఆవిడా మా ఆవిడే చిత్రంలో నటించారు. ప్రస్తుతం టబు షూటింగ్లో పాల్గొంటున్నారు. దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.
ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే 75 శాతం పూర్తయింది. దసరా తర్వాత విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. అయితే టైటిల్ నుంచి రిలీజ్ డేట్ వరకు ఏదీ ఇప్పట్లో ప్రకటించే ఉద్దేశం లేదు. సినిమా పూర్తయిన తర్వాతే ప్రచారం మొదలుపెట్టాలని నాగ్ నిర్ణయించారు. ఇలా నాగార్జున తన వందో చిత్రంపై పూర్తిస్థాయిలో ఫోకస్ పెట్టారు.


