
టైటిల్ : షష్టి పూర్తి
నటీనటులు: రాజేంద్ర ప్రసాద్, అర్చన, రూపేష్, ఆకాంక్ష సింగ్ తదితరులు
నిర్మాత: రూపేష్ చౌదరి
ఎడిటింగ్: కార్తీక శ్రీనివాస్
కథ, దర్శకత్వం: పవన్ ప్రభ
సంగీతం: ఇళయరాజా
సినిమాటోగ్రఫీ: రామ్
విడుదల: మే30, 2025
'లేడీస్ టైలర్' సినిమాతో మెప్పించిన రాజేంద్రప్రసాద్, అర్చన.. సుమారు 38 ఏళ్ల తర్వాత మరోసారి కలిసి నటించిన చిత్రం 'షష్టి పూర్తి'. మే 30న ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. పవన్ ప్రభ దర్శకత్వంలో రూపేష్ చౌదరి నిర్మించారు. ఇళయరాజా సంగీతం అందించారు. చిన్న సినిమాగా తెరకెక్కిన ఈ ప్రాజక్ట్ పబ్లిక్కు బాగా రీచ్ అయింది. ఈ సినిమాతో నిర్మాతగా, హీరోగా రూపేష్ చౌదరి ఎంట్రీ ఇచ్చారు. తనకు మొదటి సినిమానే అయినప్పటికీ మంచి పాయింట్తోనే షష్టి పూర్తి కథను ఎంచుకున్నారు. ప్రతి కుటుంబంలో కనిపించే చిన్నచిన్న అలకలు, సంతోషాలు ఎలాంటి అనుభూతిని ఇస్తాయో ఈ సినిమా చూసినవారికి గుర్తుచేస్తాయి. బిడ్డల కోసం తల్లిదండ్రులు చేసిన త్యాగాలు, కన్నవారి పట్ల పిల్లలు చూపించాల్సిన బాధ్యతలు ఎలా ఉండాలో ఈ చిత్రం చూపుతుంది. తెలుగు సంస్కృతి, సంప్రదాయాలకు పట్టం కడుతూ.. మంచి కుటుంబ విలువలున్న కథతో ఈ మూవీని రూపొందించారు.
(ఇదీ చదవండి: భైరవం మూవీ రివ్యూ)
షష్టి పూర్తి కథేంటంటే?
తల్లిదండ్రుల పెళ్లి చూసే అవకాశం వారి బిడ్డలకి ఉండదు. కానీ, పిల్లలు అనుకుంటే వారు చూడగలిగే పెళ్లి షష్టిపూర్తి ఒక్కటే. కానీ, తల్లిదండ్రులు గొడవలు పడి విడాకులు తీసుకునే స్థాయికి చేరితే ఆ పిల్లల పరిస్థితి ఎలా ఉంటుంది? ఆ నేపథ్యంలోనే షష్టి పూర్తి కథ సాగుతుంది. ఈ కథ హీరో రూపేష్ (శ్రీరామ్)తో మొదలౌతుంది. తన కాలనీలో అత్యంత నీతి, నిజాయితీ ఉన్న ప్రభుత్వ న్యాయవాదిగా ఉంటాడు. తన నిజాయితీ చూసి కాలనీ వాసులకు కూడా చిరాకు వస్తుంది. అందుకు కారణం తన అమ్మకు ఇచ్చిన మాట కోసమే అంటూ ముందుకెళ్తూ ఉంటాడు. కొన్ని కారణాల వల్ల శ్రీరామ్ తన తల్లిదండ్రులు రాజేంద్ర ప్రసాద్ (దివాకర్), అర్చన (భువన)లకు దూరంగా ఒంటరిగానే ఉంటాడు. ఒకరోజు పోలీసుల నుంచి తప్పించుకునే క్రమంలో అనుకోకుండా హీరోయిన్ ఆకాంక్ష సింగ్ (జానకి).. శ్రీరామ్ ఇంట్లోకి వెళ్లి దాక్కుంటుంది. అలా వారిద్దరి మధ్య మొదలైన పరిచయం కాస్త ప్రేమగా మారుతుంది. అయితే, తనను పెళ్లి చేసుకోవాలంటే కొన్ని కండీషన్స్ ఉన్నాయని శ్రీరామ్కు చెబుతుంది. ఇంత నిజాయితీగా ఉంటే తనకు ఇష్టం ఉండదని సూచిస్తుంది. ప్రియురాలి కోసం తనమీద తల్లి పెట్టుకున్న నమ్మకాన్ని పక్కన పెట్టేసి.. అవినీతి లాయర్గా కోర్టులో కేసులు వాదిస్తూ ఉంటాడు. అలా జానకి చెప్పిన ప్రతిపనిని శ్రీరామ్ చేస్తూ ఉంటాడు. అయితే, తను తప్పుడు దారిలో వెళ్తున్నట్లు తన తల్లికి ఎక్కడ తెలుస్తోందోననే భయంతో జానకి చెప్పిన పనులన్నీ చేస్తూంటాడు. ఒకరోజు భువన స్నేహితురాలి కొడుకును ఒక విలన్ గ్యాంగ్ చంపేస్తుంది. ఆ కేసులో తన స్నేహితురాలికి న్యాయం చేయాలని కుమారుడు శ్రీరామ్ను భువన కోరుతుంది. అయితే, అప్పటికే జానకి ప్రేమలో ఉన్న శ్రీరామ్.. విలన్ గ్యాంగ్ ఇచ్చిన డబ్బు తీసుకుని తల్లి స్నేహితురాలికి అన్యాయం చేస్తాడు. నిజాయితీగా ఉన్న శ్రీరామ్ను జానకి ఎందుకు టార్గెట్ చేస్తుంది..? విలన్ గ్యాంగ్తో జానకీకి ఉన్న లింకేంటి.? జానకి కుటుంబానికి శ్రీరామ్ తండ్రి దివాకర్ (రాజేంద్ర ప్రసాద్) చేసిన అన్యాయం ఏంటి..? 30 ఏళ్ల తర్వాత పథకం ప్రకారం రివేంజ్ తీర్చుకునేందుకు జానకీ వేసిన ఎత్తులు ఎలాంటివి..? రాజేంద్ర ప్రసాద్ (దివాకర్), అర్చన (భువన) ఒకే ఇంట్లో 30ఏళ్లుగా వేరువేరుగా ఎందుకు ఉంటున్నారు..? వారి విడాకుల కేసునే శ్రీరామ్ వాదించాల్సిన పరిస్థితికి కారణాలు ఎంటి..? తెలియాలంటే షష్టి పూర్తి సినిమా చూడాల్సిందే.
ఎలా ఉందంటే?
కొత్త వారిని ఎంకరేజ్ చేస్తేనే వారు మరిన్ని సినిమాలు తీసేందుకు ముందుకు వస్తారు. షష్టి పూర్తి సినిమా కోసం రూపేష్ నిర్మాతగా, హీరోగా ప్రేక్షకులను మెప్పించాడు. సినిమా నిర్మాణ విలువలు చాలా రిచ్గా ఉంటాయి. దర్శకుడు ఎంచుకున్న లొకేషన్లు అన్నీ చాలా అందంగా తెరపై కనిపిస్తాయి. రూపేష్కు మొదటి సినిమా అయినప్పటికీ కథలో పెద్దగా బలం లేనప్పటికీ సింగిల్ హ్యాండ్తో నడిపించాడు. ఆకాంక్ష సింగ్ (జానకి)తో రూపేష్ కాంబినేషన్స్ సీన్లు చాలా బాగుంటాయి. సినిమా ప్రారంభం పెద్దగా ఆకట్టుకోకపోయినా తర్వాత మెల్లగా ప్రేక్షకుడు కనెక్ట్ అవుతాడు. షష్టిపూర్తి సినిమా టైటిల్ పెట్టడం వల్ల సినిమా అంతా కుటుంబం చుట్టే తిరుగుతుంది అనుకుంటారు. కానీ, దర్శకుడు ఆ ట్రాక్ను తప్పించి ఫస్ట్ పార్ట్ అంతా లవ్ స్టోరీతో నడిపించాడు. రెండో పార్ట్లో రాజేంద్రప్రసాద్, అర్చనల ప్రేమ కథతో పాటు స్నేహం గురించి చూపాడు. అయితే, టైటిల్కు తగ్గట్లు సినిమా లేదనిపిస్తుంది. ఇదే పెద్ద మైనస్ కావచ్చు కూడా.. మొదటి భాగంలోనే రాజేంద్రప్రసాద్, అర్చనలకు కాస్త ప్రాధాన్యత ఇచ్చింటే బాగుండు అనిపిస్తుంది. దీంతో ప్రేక్షకుడు కూడా వారి ఎంట్రీ కోసం ఎదురుచూస్తూ ఉండాల్సిన పరిస్థితి ఎదురౌతుంది. ఆపై విలన్ గ్యాంగ్తో జానకీకి ఉన్న కనెక్షన్ను తెరపై చూపించడంలో దర్శకుడు విఫలం అయ్యాడు. కథలో ప్రతి పాత్ర వెంటనే తమ అభిప్రాయాన్ని మార్చుకోవడం వారిలో మార్పు వచ్చినట్లు తెరపై చూపించడం పెద్దగా కనెక్ట్ కాలేదు. రూపేష్, ఆకాంక్ష సింగ్ల మధ్య వచ్చే సీన్లు ప్రేక్షకులను బాగా ఎంటర్టైన్ చేయడంతో వారిద్దరి మధ్య ఇంటర్వెల్ సమయంలో వచ్చే ట్విస్ట్ అదిరిపోతుంది. ఆపై రాజేంద్రప్రసాద్, అర్చనల నుంచి వచ్చే సీన్లు ఎమోషనల్గా ప్రేక్షకుడు కనెక్ట్ అవుతాడు. ముఖ్యంగా క్లైమాక్స్లో 15 నిమిషాల పాటు రన్ అయ్యే కోర్టు డ్రామా సీన్కు ఫిదా అవుతారు.
ఎవరెలా చేశారంటే?
ఈ సినిమాలో ప్రధాన బలం రాజేంద్రప్రసాద్, అర్చనల నటనే.. కొత్తవారితో వారు నటిస్తున్నప్పటికీ తమదైన స్టైల్లో మెప్పించారు. ఆపై హీరో రూపేష్, ఆకాంక్ష సింగ్ల జోడీ అభినందనీయంగా ఉంటుంది. సీనియర్స్ నటులకు పోటీగా తమ సత్తా చూపారు. ఎక్కడా కూడా ఇదే మొదటి సినిమా అనే సందేహం రాకుండా మెప్పించారు. దర్శకుడు ఇంకాస్త కథలో మార్పులు చేసి ఉంటే బాగుండు. సినిమాలో అచ్యూత్ కుమార్, మురళీధర్ గౌడ్, చలాకీ చంటి వంటి మంచి నటులు ఉన్నప్పటికీ వారిని సరైన విధంగా ఉపయోగించుకోలేదనిపిస్తుంది. ఇళయరాజా సంగీతానికి పేరు పెట్టాల్సిన పనిలేదు. ఆయన కేవలం పాటలకు మాత్రమే మ్యూజిక్ ఇచ్చినట్లు ఉన్నారు. బీజీఎం స్కోర్ పెద్దగా ఆకట్టుకోలేదు. డైలాగ్స్కు ఇంకాస్త పదును పెట్టింటే బాగుండు. బడ్జెట్ మేరకు నిర్మాణ విలువలు బాగున్నాయి. ఒక హీరోగా, నిర్మాతగా రూపేష్ పూర్తిగా విజయం సాధించాడు.
(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 30 సినిమాలు)