నా పక్కన హీరోయిన్‌గా నటించలేమన్నారు: సప్తగిరి | Sapthagiri Comments On Actress For Pelli Kani Prasad Movie | Sakshi
Sakshi News home page

నా పక్కన హీరోయిన్‌గా నటించలేమన్నారు: సప్తగిరి

Mar 16 2025 7:34 AM | Updated on Mar 16 2025 7:58 AM

Sapthagiri Comments On Actress For Pelli Kani Prasad Movie

టాలీవుడ్‌ ప్రముఖ కమెడియన్‌ సప్తగిరి (Sapthagiri) హీరోగా ఇప్పటికే ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. చాలా రోజుల గ్యాప్‌ తర్వాత ఆయన మరోసారి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘పెళ్ళి కాని ప్రసాద్‌’(Pelli Kani Prasad). మార్చి 21న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ క్రమంలో మీడియాతో పలు విషయాలను ఆయన పంచుకున్నారు.  చిత్రపరిశ్రమలో  అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా, కమెడియన్‌గా, హీరోగా, నిర్మాతగా పని చేస్తున్నప్పటికీ తనను విమర్శిస్తూనే ఉంటారని సప్తగిరి పేర్కొన్నారు. కమెడియన్‌గా పని చేసుకోక హీరోగా చేయడమేంటి..? అంటూ కొందరు తప్పుపడుతున్నారని ఆయన అన్నారు. ఇలా ఎన్ని విమర్శలు వచ్చినా సరే ‘పెళ్ళి కాని ప్రసాద్‌’ చిత్రాన్ని తెరకెక్కించామని ఆయన అన్నారు.

'పెళ్ళి కాని ప్రసాద్‌' సినిమాలో నటించేందుకు హీరోయిన్లు ఎవరూ ముందుకు రాలేదని  సప్తగిరి ఇలా చెప్పారు. 'ఎన్నో ఆశలతో ఈ ప్రాజెక్ట్‌ను ప్రారంభించాం. హీరోయిన్‌గా నటించాలని చాలామందిని కోరినప్పటికీ ఈ కథను రిజెక్ట్‌ చేశారు. సప్తగిరి కమెడియన్‌ కదా..!  ఆయన పక్కన నటించలేమని డైరెక్ట్‌గానే చెప్పారు. నా పక్కన నటించలేమని చెప్పిన హీరోయిన్ల లిస్ట్‌ చాలా పెద్దదే ఉంది. అదంతా మా దర్శకుడు అభిలాశ్‌ రెడ్డికి తెలుసు.. అడిగితే అన్ని విషయాలు చెబుతాడు. కథ బాగుందని ఒక మంచి హీరోయిన్‌ను ఆయన ఎంచుకోవాలని ప్రయత్నం చేశాడు. కానీ, నేను కమెడియన్‌ కావడంతో నటించలేమని రిజక్ట్‌ చేశారు.  చివరకు మా అదృష్టం కొద్ది ప్రియాంక శర్మ(Priyanka Sharma) ఓకే చెప్పారు.' అని ఆయన గుర్తుచేసుకున్నారు.

ఇదే సమయంలో తన వివాహం గురించి కూడా సప్తగిరి మాట్లాడుతూ నవ్వులు పూయించారు. తనకు మంచి సంబంధం ఉంటే ఎవరైనా చూసి పెట్టాలని నవ్వుతూ కోరారు. ఈరోజుల్లో సినిమా వాళ్లకు ఎవరూ పిల్లనివ్వడంలేదని, అది నిజం అంటూ ఆయన పేర్కొన్నారు. నిజ జీవితంలో తాము ఎంత పేరు తెచ్చుకున్నా సరే.. చివరకు తమని సినిమావాళ్లనే అంటారని ఆయన అన్నారు. ఒక రకంగా తమకు  అదీ ఇబ్బందేగానే ఉంటుందని సప్తగిరి చెప్పారు. అభిలాశ్‌ రెడ్డి తెరకెక్కించిన  'పెళ్ళి కాని ప్రసాద్‌' చిత్రాన్ని కె.వై.బాబు, భాను ప్రకాశ్‌గౌడ్, సుక్కా వెంకటేశ్వర్‌ గౌడ్, వైభవ్‌ రెడ్డి ముత్యాల సంయుక్తంగా నిర్మించారు. ప్రియాంక శర్మ హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ సినిమా దిల్‌రాజు శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్‌ సంస్థ ద్వారా ఈ నెల 21న విడుదల కానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement