
బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ ఈ ఏడాది సికందర్ మూవీతో అభిమానులను అలరించాడు. ఈ చిత్రంలో రష్మిక హీరోయిన్గా నటించగా.. బాక్సాఫీస్ వద్ద పెద్దగా రాణించలేకపోయింది. ఇక సినిమాల సంగతి పక్కనపెడితే త్వరలోనే ప్రారంభం కానున్న బిగ్బాస్ సీజన్కు హోస్ట్గా చేయనున్నారు. అంతేకాకుండా ప్రస్తుతం గాల్వాన్ లోయలో 2020లో భారత్–చైనా సైనికుల మధ్య జరిగిన యుద్ధం, ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంతో వస్తోన్న ‘బ్యాటిల్ ఆఫ్ గాల్వాన్ చిత్రంలో సల్మాన్ నటిస్తున్నారు. ఇందులో ఆర్మీ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు.
అయితే సల్మాన్ ఖాన్కు పలుసార్లు బెదిరింపులు వచ్చిన సంగతి తెలిసిందే. కృష్ణ జింకను వేటాడిన కేసు తర్వాత సల్మాన్ను చంపేస్తామంటూ చాలాసార్లు బెదిరించారు. దీంతో ముంబయిలోని తన ఇంటివద్ద కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసుకున్నారు. ఇందులో భాగంగానే తాను నివాసముండే గెలాక్సీ అపార్ట్మెంట్లోని బాల్కనీలో బుల్లెట్ ఫ్రూఫ్ గాజును ఏర్పాటు చేశారు. అక్కడి నుంచే ప్రతి ఏటా రంజాన్ సందర్భంగా అభిమానులకు విషెస్ చెబుతూ ఉంటారు.
అయితే తాజా ఇంటర్వ్యూలో ఆ బుల్లెట్ ఫ్రూఫ్ గాజును ఏర్పాటు చేయడంపై సల్మాన్ ఖాన్ స్పందించారు. అయితే ఇది తన వ్యక్తిగత రక్షణ కోసం కాదని.. నా అభిమానులు కొందరు బాల్కనీ పైకి ఎక్కకుండా.. వారిని తన ఇంట్లోకి రాకుండా నివారించేందుకేనని తెలిపారు. అయినప్పటికీ కొందరు ఫ్యాన్స్ బాల్కనీ పైకి ఎక్కి నిద్రిస్తున్నారని సల్మాన్ ఖాన్ వివరించారు.
అయితే ఇటీవల సల్మాన్ నివాసం వెలుపల ప్రత్యక్షంగా కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత వాట్సాప్ ద్వారా బెదిరింపులు కూడా వచ్చాయి. ఈ సంఘటన తర్వాత సల్మాన్ ఖాన్ బుల్లెట్ ఫ్రూఫ్ గాజును ఏర్పాటు చేయించారు. అంతే కాకుండా కారులో బాంబు పెడతామని కూడా బెదిరించారు. కొంతకాలంగా సల్మాన్ఖాన్కు గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి బెదిరింపులు వస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే వారు పలుమార్లు సల్మాన్ ఇంట్లోకి చొరబడే ప్రయత్నం చేశారు. దీంతో ముంబై పోలీసులు సల్మాన్కు భద్రత కల్పించారు.