
శివ మనసులో శృతి (2012) సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది తమిళ మద్దుగుమ్మ రెజీనా కసాండ్రా (Regina Cassandra). తొలి సినిమాతోనే బాగా క్లిక్ అవడంతో టాలీవుడ్లో బిజీ హీరోయిన్గా మారిపోయింది. కొత్త జంట, రారా.. కృష్ణయ్య, పిల్లా నువ్వు లేని జీవితం, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, అ, ఎవరు.. ఇలా అనేక సినిమాలు చేసింది. ఆచార్య మూవీలో సానా కష్టం అనే స్పెషల్ సాంగ్లోనూ తళుక్కుమని మెరిసింది.
హీరోయిన్ ఛాన్స్ అడిగా
ఒకప్పుడు తెలుగులో టాప్ హీరోయిన్గా రాణించిన రెజీనా ప్రస్తుతం మాత్రం తమిళ, హిందీ భాషల్లో బిజీ అయింది. తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఓ ఆసక్తికర విషయాన్ని బయటపెట్టింది. రెజీనా మాట్లాడుతూ.. ప్రశాంత్ వర్మ అ సినిమా స్క్రిప్ట్ చెప్పారు. నాకు హీరోయిన్గా ఛాన్స్ ఇస్తే చేస్తానన్నాను, లేదంటే అందులోనే బలమైన పాత్ర అడిగాను. అందుకాయన హీరోయిన్ పాత్ర కోసం అప్పటికే కాజల్ను సంప్రదించినట్లు చెప్పాడు. సరే, పర్లేదని మరో (మీరా) పాత్ర ఇవ్వమన్నాను. అది కూడా లేదంటే మాత్రం నేను సినిమా చేయనని తెగేసి చెప్పాను.
జాట్లో ఆ పాత్ర కోసం అడిగారు
జాట్ సినిమాలో గోపీచంద్ మలినేని నాకు పోలీసాఫీసర్ పాత్ర ఆఫర్ చేశాడు. కథ మొత్తం విన్నాక నాకు భారతి రోల్ ఇస్తేనే చేస్తానన్నాను. ఎందుకంటే అంతకుముందెన్నడూ అలాంటి పాత్ర చేయలేదు. అలా జాట్ సినిమాలో భారతిగా కనిపించాను అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం రెజీనా.. తమిళంలో మూకుత్తి అమ్మన్ 2 మూవీ చేస్తోంది. హిందీలో ద వైఫ్స్, సెక్షన్ 108 సినిమాల్లో నటిస్తోంది.
చదవండి: హనుమాన్ రికార్డు బద్ధలు కొట్టిన మిరాయ్! ఫస్ట్డే కలెక్షన్స్