వీఎన్ ఆదిత్య, అజయ్ కుమార్, శ్రీనివాసరావు
‘తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్’ (టీఎఫ్డీఏ) ఆధ్వర్యంలో ప్రముఖ నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు రూ.30 కోట్ల బడ్జెట్తో పది సినిమాలు నిర్మించనున్నారు. ఈ నేపథ్యంలో ‘టీఎఫ్డీఏ’ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన సమావేశానికి చదలవాడ శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ‘టీఎఫ్డీఏ’ అధ్యక్షుడు వీఎన్ ఆదిత్య మాట్లాడుతూ–‘‘నిర్మాతలు ఉంటేనే మా దర్శకులు మనుగడ కొనసాగించగలరు. చదలవాడగారు డైరెక్టర్స్ అసోసియేషన్లోని సభ్యులకు గొప్ప అవకాశం ఇస్తున్నారు.
దీని ద్వారా పది మంది దర్శకులకు, 150 మంది అసిస్టెంట్ డైరెక్టర్స్కి అవకాశం ఇచ్చినట్టు అవుతుంది. ఆ సినిమాల్లో లాభాలు వస్తే ‘టీఎఫ్డీఏ’ యూనియన్ కే ఇస్తానని ఆయన అనడం మాకు వరం’’ అన్నారు. చదలవాడ శ్రీనివాసరావు మాట్లాడుతూ– ‘‘ప్రస్తుతం ఇండస్ట్రీలో సత్తా ఉన్న నిర్మాతలు, దర్శకులకి కూడా తక్కువ అవకాశాలు వస్తున్నాయి.
అందుకే నేను దర్శకులకు అండగా ఉండాలని నిర్ణయించుకున్నాను’’ అని పేర్కొన్నారు. ఈ సమావేశంలో ‘టీఎఫ్డీఏ’ వైస్ ప్రెసిడెంట్ సముద్ర, ట్రెజరర్ సాయి రాజేష్, దర్శకులు నవీన్ మేడారం, అజయ్ కుమార్, నిర్మాత ప్రసన్న కుమార్ మాట్లాడారు.


