ప్రభాస్‌ ప్లేస్‌లో బన్నీ.. ఎన్టీఆర్‌ ప్లేస్‌లో చరణ్‌.. ‘స్టార్స్‌’ మారిపోయారు! | Prabhas To Allu Arjun Tollywood Stars Exchanges Their Projects | Sakshi
Sakshi News home page

ప్రభాస్‌ ప్లేస్‌లో బన్నీ.. ఎన్టీఆర్‌ ప్లేస్‌లో చరణ్‌.. ‘స్టార్స్‌’ మారిపోయారు!

Jun 29 2025 11:29 AM | Updated on Jun 29 2025 5:43 PM

Prabhas To Allu Arjun Tollywood Stars Exchanges Their Projects

తినే ప్రతి గింజపై తినేవారి పేరు ఉంటుందంటుంటారు.  అలాగే ఓ దర్శకుడు రెడీ చేసిన కథ కూడా ఏ హీరో చేయాలని ఉంటే ఆ హీరో చెంతకు వెళ్తుందేమో. అప్పటికే ఒప్పుకున్న సినిమాలు, నిర్మాణ వ్యయాలు, స్క్రిప్ట్‌లో మార్పులూ  చేర్పులు, కాల్షీట్స్‌ క్లాష్‌... ఇలా కారణాలు ఏమైనా ఇటీవలి కాలంలో కథలు ఒక హీరో నుంచి మరో హీరోకి షిఫ్ట్‌ అవుతున్న ట్రెండ్‌ బాగా కనిపిస్తోంది. ఇలా ఒకరు చేస్తారనుకున్న కథలో వేరే కథానాయకుడు ఎంట్రీ ఇస్తున్నారు. ఒక హీరోతో ప్లాన్‌ చేసిన కథలో మరో హీరో కనిపించనున్నారు. ఆ వివరాల్లోకి...

సూపర్‌ హీరో 
దర్శకుడు లోకేశ్‌ కనగరాజ్‌ దర్శకత్వంలో కమల్‌హాసన్‌ లీడ్‌ రోల్‌లో రూపొందిన ‘విక్రమ్‌’ సినిమా క్లైమాక్స్‌లో రోలెక్స్‌ అనే పవర్‌ఫుల్‌ రోల్‌లో కనిపించారు సూర్య. ‘లోకేశ్‌ సినిమాటిక్‌ యూనివర్స్‌’లో భాగంగా రూపొందిన ఈ ‘విక్రమ్‌’ సినిమాలో నెగటివ్‌ షేడ్స్‌ ఉన్న రోలెక్స్‌ రోల్‌కి ఆడియన్స్‌ నుంచి మంచి రెస్పాన్స్‌ లభించింది. అయితే ‘విక్రమ్‌’ సినిమా సమయంలోనే సూర్యతో లోకేశ్‌ ఓ కొత్త సినిమాను ప్లాన్‌ చేశారని, కానీ ఇది ‘లోకేశ్‌ సినిమాటిక్‌ యూనివర్స్‌’లోని సినిమా కాదని, ఇదొక సూపర్‌ హీరో ఫిల్మ్‌ అనే టాక్‌ తెరపైకి వచ్చింది. 

అయితే రీసెంట్‌గా దర్శకుడు లోకేశ్‌ కనగరాజ్‌తో ఓ సినిమా చేయనున్నట్లుగా బాలీవుడ్‌ హీరో ఆమిర్‌ ఖాన్‌ కన్ఫార్మ్‌ చేశారు. ఇది సూపర్‌ హీరో ఫిల్మ్‌ అని, వచ్చే ఏడాదిలో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్తుందని ఆమిర్‌ ఖాన్‌ స్పష్టం చేశారు. దీంతో సూర్య హీరోగా చేయాల్సిన సూపర్‌ హీరో ప్రాజెక్ట్‌ ఆమిర్‌ ఖాన్‌ చేతికి వెళ్లిందనే టాక్‌ తెరపైకి వచ్చింది. సినిమా జానర్, దర్శకుడు ఒకరే కావడంతో సూర్య సినిమాయే ఆమిర్‌ ఖాన్‌కు వెళ్లినట్లుగా స్పష్టం అవుతోంది. 

బ్రహ్మ రాక్షస 
‘హను–మాన్‌’ వంటి బ్లాక్‌బస్టర్‌ సినిమా తర్వాత దర్శకుడు ప్రశాంత్‌ వర్మ ‘బ్రహ్మ రాక్షస’ (ప్రచారంలోకి వచ్చిన టైటిల్‌) అనే సినిమాను ఆరంభించారు. బాలీవుడ్‌ హీరో రణ్‌వీర్‌ సింగ్‌ హీరోగా మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ ఎర్నేని, వై. రవిశంకర్‌ భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మించాల్సింది. కానీ క్రియేటివ్‌ డిఫరెన్సెస్‌ వల్ల ఈ సినిమా నుంచి హీరో రణ్‌వీర్‌ సింగ్‌ తప్పుకున్నారు. అయితే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్‌ ప్రభాస్‌ చేతిలోకి వెళ్లిందని, హీరో క్యారెక్టరైజేషన్‌లో కాస్త నెగటివ్‌ షేడ్స్‌ ఉండే ఈ ‘బ్రహ్మ రాక్షస’ సినిమా చేసేందుకు ప్రభాస్‌ కూడా ఆసక్తి చూపిస్తున్నారని టాక్‌. ప్రస్తుతం ప్రభాస్‌ చేస్తున్న సినిమాల చిత్రీకరణలు ఓ కొలిక్కి వచ్చిన తర్వాత ‘బ్రహ్మ రాక్షస’ సినిమాను సెట్స్‌పైకి తీసుకువెళ్లాలని ప్రశాంత్‌ వర్మ ఆలోచిస్తున్నారని, ఆ దిశగా కార్యాచరణను మొదలుపెట్టారని తెలిసింది. ఇలా రణ్‌వీర్‌ సింగ్‌ చేయాల్సిన ప్రాజెక్ట్‌ ప్రభాస్‌ చేంతకు చేరింది. 

గేమ్‌ చేంజ్‌ 
ఎన్టీఆర్‌ ఆడాల్సిన ఆటలను రామ్‌చరణ్‌ అడుతున్నారనే టాక్‌ వినిపిస్తోంది. ‘ఉప్పెన’ సినిమా తర్వాత బుచ్చిబాబు సాన ఓ రూరల్‌ బ్యాక్‌డ్రాప్‌ స్పోర్ట్స్‌ డ్రామా కథను రెడీ చేసుకున్నారు. ఈ కథకు ఎన్టీఆర్‌ను హీరోగా అనుకుని కొన్ని రోజులు వర్క్‌ చేశారు. ‘ఉప్పెన’ తర్వాత బుచ్చిబాబు డైరెక్షన్‌లోని సినిమా ఇదే అని అందరూ అనుకున్నారు. కానీ ఈ దర్శకుడి రెండో సినిమా ‘పెద్ది’లో రామ్‌చరణ్‌ హీరోగా నటిస్తున్నారు. ఎన్టీఆర్‌ కోసం బుచ్చిబాబు రెడీ చేసిన స్క్రిప్ట్‌ స్పోర్ట్స్‌ డ్రామా కావడం, ఇప్పుడు రామ్‌చరణ్‌ ‘పెద్ది’ సినిమా కూడా స్పోర్ట్స్‌ డ్రామాగా తెరకెక్కుతుండటంతో ఎన్టీఆర్‌ చేయాల్సిన ‘పెద్ది’ సినిమా రామ్‌చరణ్‌కు షిఫ్ట్‌ అయినట్లుగా ఫిల్మ్‌నగర్‌ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. 

ఇక ‘పెద్ది’ సినిమాలో క్రికెట్, కబడ్డీ, కుస్తీ, ఖోఖో... ఇలా పలు రకాల క్రీడల ప్రస్తావన ఉంటుందని తెలిసింది. జాన్వీ కపూర్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో జగపతిబాబు, దివ్యేందు వర్మ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సుకుమార్‌ రైటింగ్స్, మైత్రీ మూవీ మేకర్స్‌ సమర్పణలో వెంకట సతీష్‌ కిలారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది మార్చి 27న విడుదల కానుంది. 

కార్తికేయుడు 
అల్లు అర్జున్‌ హీరోగా చేయాల్సిన మైథాలజీ ప్రాజెక్ట్‌ ఎన్టీఆర్‌ చేతికి వచ్చినట్లు తెలుస్తోంది. ‘జులాయి, సన్నాఫ్‌ సత్యమూర్తి, అల.. వైకుంఠపురములో..’ వంటి చిత్రాల తర్వాత హీరో అల్లు అర్జున్, దర్శకుడు త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో ఓ మైథాలజీ ప్రాజెక్ట్‌ సెట్స్‌పైకి వెళ్లాల్సింది. కానీ ‘పుష్ప: ది రూల్‌’ సినిమా తర్వాత త్రివిక్రమ్‌తో కాకుండా తమిళ దర్శకుడు అట్లీతో తన సినిమాను ముందుకు తీసుకువెళ్లారు అల్లు అర్జున్‌. అయితే అల్లు అర్జున్‌తో తాను చేయాల్సిన మైథాలజీ ప్రాజెక్ట్‌ కోసం ఏడాదిన్నరపైనే ప్రీ ప్రొడక్షన్‌ వర్క్స్‌ చేశారు త్రివిక్రమ్‌. దీంతో ఈ సినిమాను వదులుకోలేక ఈ సినిమాను ఎన్టీఆర్‌తో చేసేందుకు సిద్ధమయ్యారు త్రివిక్రమ్‌. 

కార్తికేయ (కుమారస్వామి, మురుగన్‌) ఆధారంగా ఈ మైథాలజీ సినిమా ఉంటుందనే వార్తలు వస్తున్నాయి. వీటికి తోడు ఇటీవల ముంబై ఎయిర్‌పోర్టులో ఎన్టీఆర్‌ చేతిలో ‘మురగ: గాడ్‌ ఆఫ్‌ వార్‌’ అనే పుస్తకం కనిపించింది. దీంతో త్రివిక్రమ్‌తో ఎన్టీఆర్‌ ఈ మైథాలజీ సినిమాను చేసేందుకే సన్నద్ధమౌతున్నారని, అందులో భాగంగానే ‘మురుగ’ పుస్తకాన్ని చదువుతున్నారని తెలుస్తోంది. 

అయితే ప్రస్తుతం ప్రశాంత్‌ నీల్‌తో ‘ఎన్టీఆర్‌నీల్‌’ (వర్కింగ్‌ టైటిల్‌) అనే సినిమా చేస్తున్నారు ఎన్టీఆర్‌. ఈ సినిమా కాకుండా దర్శకుడు నెల్సన్‌తో ఓ సినిమా కమిట్‌మెంట్‌ ఉందన్న వార్తలు ఉన్నాయి. ఇంకా దాదాసాహెబ్‌ ఫాల్కే బయోపిక్‌లో ఎన్టీఆర్‌ నటిస్తారనే ప్రచారం సాగుతోంది. కొరటాల శివతో ‘దేవర 2’ ఉంటుందని ఎన్టీఆర్‌నే కన్ఫార్మ్‌ చేశారు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్‌తో త్రివిక్రమ్‌ చేసే సినిమా సెట్స్‌పైకి వెళ్లడానికి కాస్త సమయం పట్టేలా ఉంది. ఈలోపు వెంకటేశ్‌తో త్రివిక్రమ్‌ ఓ సినిమాను పూర్తి చేస్తారని, ఆ తర్వాత ఎన్టీఆర్‌తో సినిమాను సెట్స్‌పైకి తీసుకుని వెళ్తారనే టాక్‌ ఫిల్మ్‌నగర్‌ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. 
 

రావణం 
కొంతమంది దర్శకులకు కొన్ని డ్రీమ్‌ ప్రాజెక్ట్స్‌ ఉంటాయి. అలా ‘సలార్, కేజీఎఫ్‌’ చిత్రాలను తెరకెక్కించిన ప్రశాంత్‌ నీల్‌ డ్రీమ్‌ ప్రాజెక్ట్స్‌లో ‘రావణం’ ఒకటి. ఈ మైథాలజీ సినిమాను ‘దిల్‌’ రాజు నిర్మిస్తారు. అయితే ఈ సినిమాలో ప్రభాస్‌ హీరో అనే టాక్‌ తెరపైకి వచ్చింది. కానీ ఈ చిత్రం ఇప్పుడు అల్లు అర్జున్‌ చేతికి వెళ్లిందని టాక్‌. 

ప్రభాస్‌కు భారీ లైనప్‌ ఉండటం వల్లనే అల్లు అర్జున్‌తో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లే అవకాశాలు ఉన్నాయనే టాక్‌ వినిపిస్తోంది. మరి... ప్రభాస్‌ ప్రాజెక్ట్‌ అల్లు అర్జున్‌ చేతికి వెళ్లిందా? లెట్స్‌ వెయిట్‌ అండ్‌ సీ. అయితే అల్లు అర్జున్‌ ప్రస్తుతం అట్లీతో సినిమా చేస్తున్నారు. సందీప్‌రెడ్డి వంగాతో ఓ సినిమా, సుకుమార్‌తో ‘పుష్ప 3’ సినిమాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ‘రావణం’ సినిమా సెట్స్‌కు వెళ్లడానికి మరింత సమయం పట్టేలా తెలుస్తోంది. 

తొలిసారి కొత్తగా... 
యాక్షన్, లవ్‌స్టోరీ, ఫ్యామిలీ డ్రామా... ఇలాంటి తరహా సినిమాలను చాలానే చేశారు హీరో రామ్‌. కానీ సస్పెన్స్, హారర్, థ్రిల్‌ జానర్స్‌లో రామ్‌ హీరోగా వచ్చిన సినిమాలు లేవు. ఇప్పుడు  ఈ జానర్‌లోకి ఎంట్రీ ఇచ్చేందుకు రామ్‌ సిద్ధమయ్యారనే టాక్‌ వినిపిస్తోంది. నాగచైతన్య కోసం కిశోర్‌ అనే ఓ నూతన దర్శకుడు ఓ సూపర్‌ నేచురల్‌ హారర్‌ థ్రిల్లర్‌ స్టోరీని రెడీ చేశారట. రానా స్పిరిట్‌ మీడియా, ఆర్కా మీడియా సంస్థలు ఈ సినిమాను నిర్మించేందుకు సిద్ధమయ్యాయని సమాచారం. కానీ ‘విరూపాక్ష’తో సూపర్‌ హిట్‌ సాధించిన కార్తీక్‌ వర్మ దండు డైరెక్షన్‌లో ‘వృషకర్మ’ (ప్రచారంలో ఉన్న టైటిల్‌) అనే మూవీతో నాగచైతన్య ముందుకు వెళ్లారు. ఇలా కిశోర్‌ రెడీ చేసిన కథ హోల్డ్‌లో పడింది. అయితే ఈ కథ ఇప్పుడు రామ్‌ చెంతకు చేరిందని, ఈ సినిమా స్క్రిప్ట్‌ పట్ల రామ్‌ చాలా ఆసక్తిగా ఉన్నారని, త్వరలోనే ఈ సినిమా సెట్స్‌కు వెళ్లనుందనీ సమాచారం. 

తమ్ముడు 
వెండితెరపై ‘తమ్ముడు’ రీ ప్లేస్‌ అయ్యాడు. నితిన్‌ హీరోగా చేసిన తాజా చిత్రం ‘తమ్ముడు’. కానీ ఈ సినిమా హీరో నాని చేయాల్సిందని తెలిసింది. చివరి నిమిషంలో నితిన్‌ చేశారు. మరో ఆసక్తిరమైన విశేషం ఏంటంటే... ‘బలగం’ వంటి హిట్‌ ఫిల్మ్‌ తర్వాత వేణు ఎల్దండి ‘ఎల్లమ్మ’ అనే మరో రూరల్‌ బ్యాక్‌డ్రాప్‌ మూవీ చేసేందుకు రెడీ అయ్యారు. ఈ సినిమాలోని హీరో పాత్ర కోసం నానీని మేకర్స్‌ సంప్రదించారు. కొన్ని చర్చలు కూడా జరిగాయి. కానీ చివరి నిమిషంలో ఈ సినిమా నితిన్‌ చేతికి చేరింది. ఈ ఏడాదిలోనే ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభం కానుంది. ‘బలగం’ సినిమాను నిర్మించిన ‘దిల్‌’ రాజు ఈ ‘ఎల్లమ్మ’ సినిమానూ నిర్మించనున్నారు. ఇక ‘ఎల్లమ్మ’లో హీరోయిన్‌గా సాయిపల్లవి, కీర్తీ సురేష్‌ వంటి తారల పేర్లు తెరపైకి వచ్చాయి. 

చెన్నై లవ్‌స్టోరీ 
ఆనంద్‌ దేవరకొండ లవ్‌స్టోరీ కిరణ్‌ అబ్బవరంకి వెళ్లింది. వైష్ణవీ చైతన్య, ఆనంద్‌ దేవరకొండ, విరాజ్‌ అశ్విన్‌ నటించిన ‘బేబీ’ సినిమా 2023లో రీలీజై, సూపర్‌హిట్‌గా నిలిచిన విషయం తెలిసిందే. ఈ సినిమాకు ‘కలర్‌ఫొటో’ ఫేమ్‌ సాయి రాజేశ్‌ దర్శకుడు. కాగా ఈ సినిమా తర్వాత సాయిరాజేశ్‌ మరో లవ్‌స్టోరీని రెడీ చేశారు. రవి నంబూరి ఈ సినిమాకు దర్శకుడు. ‘బేబీ’ సినిమాలో లీడ్‌ పెయిర్‌గా నటించిన ఆనంద్‌ దేవరకొండ, వైష్ణవీ చైతన్య ఈ సినిమా చేయాల్సింది. కానీ ఈ సినిమా నుంచి ఇద్దరూ తప్పుకోవడంతో వారి స్థానాల్లో కిరణ్‌ అబ్బవరం, శ్రీ గౌరిప్రియ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. సాయి రాజేశ్, ఎస్‌కేఎన్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఆల్రెడీ ఈ  సినిమా చిత్రీకరణ మొదలైంది. వీలైతే ఈ ఏడాది లేకపోతే, వచ్చే ఏడాది ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ‘చెన్నై లవ్‌ స్టోరీ’ సినిమాను రిలీజ్‌ చేయాలనుకుంటున్నారు. 

ఇలా ఈ తరహాలో ముందు ఓ కథను ఓ హీరో ఆల్మోస్ట్‌ ఒప్పుకుని, ఆ తర్వాత ఆ కథలో మరో హీరో నటిస్తున్న, నటించనున్న సినిమాలు మరికొన్ని ఉన్నాయి. 
-  మూసిని శివాంజనేయులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement