మహాత్మా జ్యోతిరావు ఫూలే, సావిత్రీబాయి ఫూలే మీద మొదటిసారి ఒక హిందీ సినిమా తెరపైకి వచ్చింది. డైరెక్టర్ అనంత్ మహాదేవన్ తెరకెక్కించిన ఈ చిత్రంలో ప్రతీక్ గాంధీ, పత్రలేఖా పాల్ అనే ఇద్దరు యాక్టర్లు ఫూలే, సావిత్రిగా నటించారు. గతేడాదిలో అనేక వివాదాల మధ్య ఈ చిత్రం విడుదలైంది. అయితే, ఇప్పుడు తెలుగు వర్షన్ కూడా రిలీజ్ కానుంది. ఈ క్రమంలో తెలుగు ట్రైలర్ను మేకర్స్ తాజాగా విడుదల చేశారు. ఈ సినిమా బ్రాహ్మణ సమాజాన్ని తప్పుగా చూపిస్తుందనీ... కులవాదాన్ని ప్రోత్సహిస్తుందనీ బ్రాహ్మణ ఫెడరేషన్ అధ్య క్షుడు ఆనంద్ దవేతో పాటు పలు బ్రాహ్మణ సంఘాలు ఆరోపించడంతో సినిమా విడుదల సమయంలో అనేక అడ్డంకులు ఎదురయ్యాయి.
అయితే, అయితే స్వయంగా బ్రాహ్మ ణుడైన ఈ చిత్ర దర్శకుడు అనంత్ మహాదేవన్ ఈ ఆరోపణలను ఖండిస్తూ, సినిమా చారిత్రక వాస్తవాల ఆధారంగా రూపొందిందనీ, ఎటు వంటి అజెండా లేదనీ చెప్పారు. దీంతో ఎట్టకేలకు గతేడారి ఏప్రిల్ 25న విడుదలైంది. సుమారు ఏడాది తర్వాత ఇప్పుడు తెలుగు వర్షన్ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఫూలే 199వ జయంతి సందర్భంగా ఏప్రిల్ 11న తెలుగులో ఈ చిత్రం విడుదలయ్యే అవకాశం ఉంది.
ఫూలే స్వయంగా చదువు చెప్పి సావిత్రీబాయిని దేశంలోనే మొదటి మహిళా టీచర్ని చేశాక, పుణె పట్టణ సమీపంలోని దళితవాడలో ఆడపిల్లలకు స్కూలు పెట్టారు. ఏ కులానికి చెందిన అమ్మాయిలైనా వచ్చి చదువుకోవచ్చని ప్రకటించారు. సావిత్రీబాయితోపాటు చదువుకున్న ముస్లిం స్త్రీ ఫాతిమా షేక్ ఆమెకు అండగా ఉండేది. సావిత్రీబాయి ఈ దేశం మొత్తం చరిత్రలో భర్త సహాయంతో చదువుకొని టీచరై, ఆడపిల్లలకు బడి పెట్టిన మొదటి మహిళగా ఆమె గుర్తింపు పొందారు.


