మ్యూజిక్ కంపోజర్ పలాష్ ముచ్చల్.. ఇతడి గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఎందుకంటే టీమిండియా మహిళా క్రికెటర్ స్మృతి మంధానతో నాలుగేళ్ల పాటు ప్రేమలో ఉన్నాడు. తీరా పెళ్లికి కొన్ని గంటల ముందు ఇది కాస్త రద్దయింది. దీంతో పలాష్ గురించి రకరకాల రూమర్స్ వినిపించాయి. స్మృతితో వివాహం పెట్టుకుని మరో మహిళతో రిలేషన్ నడిపాడనే పుకార్లు వచ్చాయి. ఆ విషయాన్ని అందరూ మెలమెల్లగా మరిచిపోతున్నారు. సరిగ్గా ఇలాంటి టైంలో పలాష్పై చీటింగ్ కేసు నమోదు కావడంతో మరోసారి హాట్ టాపిక్ అయిపోయాడు.
స్వతహాగా మ్యూజిక్ కంపోజర్ అయిన పలాష్.. సినిమాలని కూడా డైరెక్ట్ చేస్తుంటారు. అలానే సాంగ్లీకి చెందిన ఫిలిం ఫైనాన్సర్ విద్యన్ మానేతో పలాష్కి 2023లో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలోనే తాను 'నజరియా' అనే మూవీ తీస్తున్నానని, దానికి పెట్టుబడి పెడతారా అని పలాష్, మానేని కోరాడు. త్వరగా దీన్ని పూర్తి చేసి ఓటీటీలో విడుదల చేస్తే పెట్టుబడితో పాటు లాభాలు కూడా వస్తాయని మానేకు హామీ ఇచ్చాడు. అలానే మూవీలో యాక్టింగ్ ఛాన్స్ ఇస్తానని పలాష్ నమ్మబలికాడు. దీన్ని నమ్మిన మానే.. విడతల వారీగా రూ.40 లక్షలు పలాష్కి ఇచ్చాడు.
(ఇదీ చదవండి: ఓటీటీలోకి మలయాళ హిట్ 'సర్వం మాయ'.. తెలుగులోనూ స్ట్రీమింగ్)
నెలలు గడుస్తున్నా సినిమా పూర్తి కాకపోవడంతో.. తన డబ్బులు తిరిగి ఇచ్చేయమని మానే పలాష్ని అడిగాడు. తొలుత ఇస్తానని హామీ ఇచ్చిన పలాష్.. తర్వాత ఫోన్ కాల్స్ ఎత్తడం మానేశాడు. నంబర్ కూడా బ్లాక్ చేశాడు. దీంతో మానే.. పోలీసులని ఆశ్రయించాడు. పలాష్పై ఫిర్యాదు చేశాడు. తన నుంచి రూ.40 లక్షలు తీసుకుని మోసం చేశాడని, ఆ మొత్తాన్ని తనకు ఇప్పించాలని కోరాడు. దీంతో పలాష్పై చీటింగ్ కేసు నమోదైంది. బాధితుడు ఇచ్చిన ఆధారాలు పరిశీలిస్తున్నామని, ప్రస్తుతం విచారణ జరుగుతోందని పోలీసులు చెప్పుకొచ్చారు.
రెండు నెలల క్రితం స్మృతితో పెళ్లి రద్దు, ఇప్పుడేమో పలాష్పై పోలీస్ కేసు చూస్తుంటే కొత్త సందేహాలు తలెత్తుతున్నాయి. సోషల్ మీడియాలో వినిపిస్తున్న పుకార్లకు తోడు రూ.40 లక్షల మోసం గురించి తెలిసే స్మృతి.. తన పెళ్లిని వద్దనుకుందా అని మాట్లాడుకుంటున్నారు. స్మృతితో విడిపోయిన తర్వాత పలాష్.. కెరీర్పై ఫోకస్ చేశాడు. ప్రస్తుతం మరాఠీ నటుడు శ్రేయస్ తల్పడేతో ఓ మూవీని డైరెక్ట్ చేసేందుకు సిద్ధమవుతున్నాడు.
(ఇదీ చదవండి: శోభిత 'చీకటిలో' సినిమా రివ్యూ)


