జెట్‌లీ ప్రదర్శనను నిలిపివేయడం తగదు | Mythri Movie Makers Raises Concern Over Multiplex Screening of Jetlee Movie | Sakshi
Sakshi News home page

జెట్‌లీ ప్రదర్శనను నిలిపివేయడం తగదు

May 2 2026 8:06 AM | Updated on May 2 2026 8:11 AM

Mythri Movie Makers Raises Concern Over Multiplex Screening of Jetlee Movie

మల్టీప్లెక్స్‌ తరహాలోనే పర్సెంటే జీ విధానంలో సినిమాలను ప్రదర్శించాలని హైదరాబాద్‌లోని 23 సింగిల్‌ స్క్రీన్ల  థియేటర్ల యజమానులు నిర్ణయించినట్లు ‘తెలంగాణ స్టేట్‌ ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌’(టీఎఫ్‌సీసీ) గతంలో ఓ ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ పర్సెంటేజీ బేస్డ్‌ స్క్రీనింగ్‌ విధానాన్ని తాము అంగీకరించమని, పాత విధానాన్నే కొనసాగించాలని ‘యాక్టివ్‌ తెలుగు ఫిల్మ్‌ ప్రొడ్యూసర్స్‌ గిల్డ్‌’ సభ్యులు ‘టీఎఫ్‌సీసీ’కి లేఖ పంపిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో తెలంగాణలోని సింగిల్‌ స్క్రీన్‌ థియేటర్లలో వీకెండ్‌ రెంటల్స్, రెవెన్యూ షేరింగ్‌ నిబంధనలపై గత కొంతకాలంగా మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్‌ ఎల్‌ఎల్‌పీ సంస్థకు, ఎగ్జిబిటర్లకు మధ్య భేదాభిప్రాయాలు నడుస్తున్నాయి. 

ఈ సమస్య పరిష్కారం అయ్యే వరకు ‘మైత్రి’ సినిమాలను సింగిల్‌ స్క్రీన్లలో ప్రదర్శించకూడదని ఎగ్జిబిటర్లు నిర్ణయించుకున్నారు. అయితే శుక్రవారం మైత్రి సంస్థ నుంచి విడుదలైన  ‘జెట్‌లీ’ సినిమాను పలు మల్టీప్లెక్స్‌లలో ప్రదర్శించలేదట. ఈ విషయంపై మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్‌ ఎల్‌ఎల్‌పీ భాగస్వామి అయిన కేతిరెడ్డి శశిధర్‌ ఓ ప్రకటన విడుదల చేశారు. 

‘‘సింగిల్‌ స్క్రీన్‌ థియేటర్ల సమస్యపై మొదటి నుంచి మేము చర్చలకు సిద్ధంగా ఉన్నాం. ఈ సమస్య ఇంకా పరిష్కారం కానప్పటికీ మీ నిర్ణయాన్ని మేము గౌరవించాం. కానీ ‘జెట్‌లీ’ మూవీ విషయంలో జరిగింది ఆమోదయోగ్యం కాదు. మీ నియంత్రణలో ఉన్న మల్టీప్లెక్స్‌లో మా సినిమా ప్రదర్శనను నిలిపివేశారు. ఈ నిర్ణయం మాపై ఒత్తిడి తీసుకురావడానికి చేస్తున్న ప్రయత్నంలా కనిపిస్తోంది. వెంటనే పునరాలోచించి మల్టీప్లెక్స్‌లలో ‘జెట్‌లీ’ ప్రదర్శనకు అనుమతించాలి’’ అని కోరారు.  

Advertisement
 
Advertisement
Advertisement