మల్టీప్లెక్స్ తరహాలోనే పర్సెంటే జీ విధానంలో సినిమాలను ప్రదర్శించాలని హైదరాబాద్లోని 23 సింగిల్ స్క్రీన్ల థియేటర్ల యజమానులు నిర్ణయించినట్లు ‘తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్’(టీఎఫ్సీసీ) గతంలో ఓ ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ పర్సెంటేజీ బేస్డ్ స్క్రీనింగ్ విధానాన్ని తాము అంగీకరించమని, పాత విధానాన్నే కొనసాగించాలని ‘యాక్టివ్ తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్’ సభ్యులు ‘టీఎఫ్సీసీ’కి లేఖ పంపిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో తెలంగాణలోని సింగిల్ స్క్రీన్ థియేటర్లలో వీకెండ్ రెంటల్స్, రెవెన్యూ షేరింగ్ నిబంధనలపై గత కొంతకాలంగా మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ఎల్ఎల్పీ సంస్థకు, ఎగ్జిబిటర్లకు మధ్య భేదాభిప్రాయాలు నడుస్తున్నాయి.
ఈ సమస్య పరిష్కారం అయ్యే వరకు ‘మైత్రి’ సినిమాలను సింగిల్ స్క్రీన్లలో ప్రదర్శించకూడదని ఎగ్జిబిటర్లు నిర్ణయించుకున్నారు. అయితే శుక్రవారం మైత్రి సంస్థ నుంచి విడుదలైన ‘జెట్లీ’ సినిమాను పలు మల్టీప్లెక్స్లలో ప్రదర్శించలేదట. ఈ విషయంపై మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ఎల్ఎల్పీ భాగస్వామి అయిన కేతిరెడ్డి శశిధర్ ఓ ప్రకటన విడుదల చేశారు.
‘‘సింగిల్ స్క్రీన్ థియేటర్ల సమస్యపై మొదటి నుంచి మేము చర్చలకు సిద్ధంగా ఉన్నాం. ఈ సమస్య ఇంకా పరిష్కారం కానప్పటికీ మీ నిర్ణయాన్ని మేము గౌరవించాం. కానీ ‘జెట్లీ’ మూవీ విషయంలో జరిగింది ఆమోదయోగ్యం కాదు. మీ నియంత్రణలో ఉన్న మల్టీప్లెక్స్లో మా సినిమా ప్రదర్శనను నిలిపివేశారు. ఈ నిర్ణయం మాపై ఒత్తిడి తీసుకురావడానికి చేస్తున్న ప్రయత్నంలా కనిపిస్తోంది. వెంటనే పునరాలోచించి మల్టీప్లెక్స్లలో ‘జెట్లీ’ ప్రదర్శనకు అనుమతించాలి’’ అని కోరారు.


