అసలు కథ ఇదేనా? | Mahesh babu Varanasi Movie Update in Tollywood | Sakshi
Sakshi News home page

అసలు కథ ఇదేనా?

Apr 10 2026 12:05 AM | Updated on Apr 10 2026 12:05 AM

Mahesh babu Varanasi Movie Update in Tollywood

ప్రపంచవ్యాప్త ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తున్న ‘వారణాసి’ సినిమా గురించి ఏ వార్త బయటకొచ్చినా చర్చనీయాంశమౌతోంది. తాజాగా ‘వారణాసి’ స్టోరీ లైన్‌ ఇది అంటూ ఓ న్యూస్‌ బయటకు వచ్చింది. ఈ సినిమాకు వీఎఫ్‌ఎక్స్‌ విభాగంలో పని చేస్తున్న స్టూడియో ఒకటి ఈ సినిమా కథను క్లుప్తంగా తన వెబ్‌సైట్‌లో రాసుకొచ్చినట్లుగా తెలుస్తోంది. ‘‘శివభక్తుడు (మహేశ్‌బాబు) కాలాతీతమైన ఓ సాహసోపేతమైన ప్రయాణం చేస్తూ, శతాబ్దాలుగా మరుగున పడిన ప్రాచీన నిగూఢ రహస్యాలను చేధించుకుంటూ ముందుకు సాగుతుంటాడు. అపారమైన శక్తి కలిగిన ఒక వస్తువు జాడ కనుక్కుని, దాన్ని చేజిక్కించుకోవడం అతని లక్ష్యం.

ఈ క్రమంలో తాను ప్రయాణం చేసేలా పరిస్థితులను సృష్టించి, ప్రపంచంపై శాశ్వత ఆధిపత్యం సాధించాలనే క్రూరమైన సంకల్పం కలిగిన వ్యక్తి నిజ స్వరూపాన్ని తెలుసుకుంటాడు. అప్పుడు ఆ శివభక్తుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నాడు? ఆ తర్వాతి పరిణామాలు ఏంటి? అన్నదే ‘వారణాసి’ కథాంశం’’ అని’’ ఆ వీఎఫ్‌ఎక్స్‌ కంపెనీ రాసుకొచ్చింది. దీంతో... ‘వారణాసి’ స్టోరీ ఇదేననే ప్రచారం సాగుతోంది. మరి... అసలు కథ ఇదేనా? అనేది తెలియాల్సి ఉంది. మహేశ్‌బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘వారాణాసి’. ఈ సినిమాలో రుద్రగా, శ్రీరాముడిగా మహేశ్‌బాబు ద్విపాత్రాభినయం చేస్తున్నారు.

విలన్‌ కుంభగా పృథ్వీరాజ్, మందాకినిగా ప్రియాంకా చోప్రా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూట్‌ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఈ షెడ్యూల్‌తో పృథ్వీరాజ్‌ పాత్ర చిత్రీకరణ పూర్తయింది. మహేశ్‌బాబు, ప్రియాంకాలపై చిత్రీకరణ జరుగుతోంది. మరోవైపు ఈ సినిమా కోసం ఓ ప్రత్యేక సెట్‌ను కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఈ సెట్‌లో మహేశ్‌బాబు, ప్రియాంకలపై ఓ పాటను చిత్రీకరించనున్నారని తెలిసింది. బాబుల్‌ సుప్రియోతో ఓ పాటను రికార్డు చేసినట్లుగా చిత్ర సంగీతదర్శకుడు కీరవాణి ఇన్‌స్టాలో పేర్కొన్నారు. ఈ పాటను ఉద్దేశించే ఆయన పేర్కొన్నారని ఫ్యాన్స్‌ అంటున్నారు. ఎస్‌ఎస్‌ కార్తికేయ, కేఎల్‌ నారాయణ నిర్మిస్తున్న ‘వారణాసి’ వచ్చే ఏడాది ఏప్రిల్‌ 7న విడుదల కానుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement