
గల్భ్ అకాడమీ మూవీ అవార్డ్స్ (గామా) ఐదవ ఎడిషన్కు రంగం సిద్ధమైంది. ఆగస్ట్ 30న దుబాయ్లోని షార్జా ఎక్స్పో సెంటర్లో ఈ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం గ్రాండ్గా జరగనుంది. ఇందుకు సంబంధించిన థీమ్ సాంగ్ను దుబాయ్లో లాంచ్ చేశారు. చంద్రబోస్ సాహిత్యం అందించిన ఈ పాటను రఘు కుంచె కంపోజ్ చేసి పాడారు. సందర్భంగా ‘గామా అవార్డ్స్’ చైర్మన్ త్రిమూర్తులు గారు మాట్లాడుతూ ‘ దుబాయ్ లో జరిగే ఏకైక అతి పెద్ద వేడుక గామా అవార్డ్స్. గత నాలుగు ఎడిషన్లు ఘనంగా పూర్తి చేసుకున్నాం. ఆగస్ట్ 30న జరగబోయే 5వ ఎడిషన్ను కూడా మన తెలుగు వారు అందరూ , ఈ కార్యక్రమానికి సహకరించి, అధిక సంఖ్యలో హాజరు అయ్యి విజయవంతం చేయాలి’అని కోరారు.
దుబాయ్లో జరిగే ఈ ఈవెంట్కి టాలీవుడ్ హీరోలు సిద్దు జొన్నలగడ్డ, తేజ సజ్జ, కిరణ్ అబ్బవరం, శ్రీ విష్ణు, రోషన్.. హీరోయిన్స్ మీనాక్షి చౌదరి, దక్ష నాగర్కర్ తో పాటు.. తెలుగు చలనచిత్ర పరిశ్రమ నుంచి అగ్ర కథానాయకులు, టాప్ టెక్నీషియన్స్ పాల్గొనబోతున్నారు. అలాగే హీరోయిన్స్ ఊర్వశి రౌతేలా, కేతిక శర్మ, ఫరియా అబ్దుల్లా, ప్రియా హెగ్డే, శ్రీదేవి స్పెషల్ పర్ఫార్మెన్స్ లతో అలరించనున్నారు.
ప్రత్యేక అతిధులుగా బ్రహ్మానందం, దర్శకులు సుకుమార్, బుచ్చిబాబు, బాబీ, సాయి రాజేష్, సంగీత దర్శకులు దేవిశ్రీప్రసాద్, తమన్, నిర్మాతలు అశ్విని దత్, డివివి దానయ్య, చంద్రబోస్, వెన్నెల కిషోర్ తదితర ప్రముఖులు హాజరవనున్నారు.
వీరితో పాటు పలువురు టాలీవుడ్ అగ్రశ్రేణి నటీనటులు సర్ ప్రైజ్ గెస్ట్ లుగా హాజరు కానున్నారు. అతిరథ ప్రముఖుల మధ్య అంగరంగ వైభవంగా జరగనున్న ఈ అవార్డ్స్ వేడుక కోసం చిత్ర పరిశ్రమతో పాటు ప్రేక్షకులు సైతం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.