మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా వస్తోన్న పీరియాడికల్ యాక్షన్ ఎంటర్టైనర్ డ్రాగన్. ఈ మూవీకి ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ నెల 20న యంగ్ టైగర్ బర్త్ డే సందర్భంగా ఫస్ట్ గ్లింప్ల్ రిలీజ్ చేయగా అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. వ్యూస్ పరంగా రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేస్తోంది. సలార్’, ‘కేజీఎఫ్’ లాంటి భారీ సినిమాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న ప్రశాంత్ నీల్ మరోసారి తన మార్క్ చూపించాడు. ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ లుక్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది.
అయితే తాజాగా ఎన్టీఆర్కు సంబంధించిన ఓ న్యూస్ తెగ వైరలవుతోంది. ఈ మూవీలో తన లుక్ కోసం తీవ్రంగా శ్రమించినట్లు తెలుస్తోంది. కేవలం నాలుగు నెలల్లోనే దాదాపు 15 కిలోల బరువు తగ్గారని సమాచారం. ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్ దశలోనే బరువు తగ్గాల్సి ఉంటుందని ఎన్టీఆర్తో చెప్పానని దర్శకుడు ప్రశాంత్ నీల్ వెల్లడించారు. ఈ ప్రక్రియలో భాగంగానే జూనియర్ ఎన్టీఆర్ మరింత బలహీనంగా, పాలిపోయినట్లుగా కనిపించారని నీల్ అన్నారు. ఈ శారీరక మార్పు చూసి ఆయన కుటుంబ సభ్యులు, సన్నిహితులు ఆందోళన చెందారని దర్శకుడు వెల్లడించారు.
ఏడాదిన్నర క్రితమే ప్లాన్..
దాదాపు ఏడాదిన్నర క్రితం 'డ్రాగన్' లుక్ టెస్టుల సమయంలోనే ఈ మార్పు మొదలైందని దర్శుకుడు వెల్లడించారు. జూనియర్ ఎన్టీఆర్ పోషించిన లూగర్ పాత్ర గురించి చర్చిస్తున్నప్పుడు కండలు తిరిగిన యాక్షన్ హీరో లుక్ కంటే.. సన్నని శరీరాకృతి ఆ పాత్రకు బాగా సరిపోతుందని డైరెక్టర్ అన్నారు. అందువల్లే ఈ రోల్ కోసం కొంచెం బరువు తగ్గమని మాత్రమే తాను సూచించానని.. కానీ జూనియర్ ఎన్టీఆర్ పూర్తి అంకితభావంతో ఆ సవాలును స్వీకరించారని ప్రశాంత్ నీల్ చెప్పారు. ముఖ్యంగా తన ఫిట్నెస్ పూర్తిగా దృష్టి పెట్టడానికి దాదాపు నాలుగు నెలల పాటు అన్ని షూటింగ్ కార్యక్రమాలకు విరామం ఇచ్చినట్లు సమాచారం.
కఠినమైన ఆహార ప్రణాళిక, తీవ్రమైన వర్కౌట్ సెషన్లు, నిశితమైన వైద్య పర్యవేక్షణ వల్లే ఇది సాధ్యమైందని డైరెక్టర్ తెలిపారు. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ బలహీనంగా.. పాలిపోయినట్లు కనిపించడంతో చాలాసార్లు ఆపేయమని చెప్పానని.. అయినా కూడా అతను వినలేదని దర్శకుడు పేర్కొన్నారు. అయితే గతంలో ఎన్టీఆర్ లుక్పై చాలా రూమర్స్ వచ్చాయి. ఓజెంపిక్ వంటి బరువు తగ్గించే మందుల వాడారని వార్తలొచ్చాయి. కానీ వీటన్నింటినీ టీమ్ ఖండించింది. క్రమశిక్షణతో కూడిన శిక్షణ, పోషణతోనే ఇది సాధ్యమైందని క్లారిటీ ఇచ్చారు. కాగా.. ఈ చిత్రంలో అనిల్ కపూర్, అశుతోష్ రాణా, రుక్మిణి వసంత్, బిజు మీనన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం జూన్ 2027లో థియేటర్లలో విడుదల కానుంది.


