
బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణె (Deepika Padukone) పేరు ఇటీవల ఎక్కువగా వినిపిస్తోంది. దీనికి ప్రధాన కారణం ఇండస్ట్రీలో 8 గంటల పనిపై కామెంట్స్ చేయడమే. స్టార్ హీరోలంతా కేవలం ఎనిమిది గంటలే పని చేస్తున్నారని.. తాను కూడా అంతేనని తేల్చి చెబుతోంది. ఇటీవలే కల్కి 2, స్పిరిట్ వంటి రెండు పెద్ద సినిమాల నుంచి అనూహ్యంగా తప్పుకుంది. దీపికా రెమ్యునరేషన్ కూడా భారీగా డిమాండ్ చేసిందని వార్తలొచ్చాయి. అంతేకాకుండా తనతో పాటు తన టీమ్ మొత్తానికి వానిటీ వ్యాన్లు, లగ్జరీ హోటల్స్లో వసతులు కల్పించాలని షరతులు పెట్టినట్లు ప్రచారం జరిగింది.
ఇదంతా పక్కన పెడితే తాజాగా దీపికా పదుకొణెకు అరుదైన గౌరవం దక్కింది. ఇవాళ ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం కావడంతో దీపికా పదుకొణెను ఇండియాకు అంబాసిడర్గా నియమించారు. ది లివ్ లవ్ లాఫ్ (LLL) ఫౌండేషన్ వ్యవస్థాపకురాలైన దీపికాను కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ (MoHFW) మనదేశ మొట్టమొదటి మానసిక ఆరోగ్య రాయబారిగా ఎంపికైంది. దీపికా ఎంపిక భారతదేశంలో మానసిక ఆరోగ్య సమస్యల గురించి విస్తృతంగా అవగాహన కల్పించడంలో సహాయపడుతుందని ఆరోగ్య మంత్రిత్వశాఖ ప్రకటించింది.
ఈ నియామకంపై దీపికా పదుకొణె మాట్లాడుతూ.. 'కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖకు మొదటి మానసిక ఆరోగ్య రాయబారిగా పనిచేయడం నాకు చాలా గౌరవంగా ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో భారతదేశం మానసిక ఆరోగ్య సంరక్షణకు ప్రాధాన్యత ఇవ్వడంలో గణనీయమైన పురోగతి సాధించింది. మనదేశంలో అవగాహన కల్పించడానికి.. మరింత బలోపేతం చేయడానికి మంత్రిత్వ శాఖతో కలిసి పనిచేయడానికి ఎదురుచూస్తున్నాను" అని అన్నారు.
అంతేకాకుండా 2015లో తాను స్థాపించిన ది లైవ్ లవ్ లాఫ్ ప్రయాణం గురించి మాట్లాడింది. దాదాపు పదేళ్ల క్రితం ఈ సంస్థను ప్రారంభించానని తెలిపింది. ప్రజలు నా దగ్గరికి వచ్చి నువ్వు ఒక ప్రాణాన్ని కాపాడావు..నువ్వు నా కూతురికి సహాయం చేశావు అని చెప్పినప్పుడు వచ్చిన ఆనందం మరెక్కడా తనకు లభించలేదని తెలిపింది. మనదేశంలో మానసిక ఆరోగ్య సంరక్షణ యోగా, ధ్యానం వంటి భారతీయ సంప్రదాయాలను రోజువారీ జీవితంలో ఒక సాధారణ ప్రక్రియగా మార్చడంలో కూడా ఉందని అభిప్రాయం వ్యక్తం చేసింది. మానసిక ఆరోగ్య అవగాహన అనేది ఏదో ఒక రోజు గల్లీ క్రికెట్ లాగా విస్తృతంగా వ్యాప్తి చెందుతుందని చెప్పుకొచ్చింది.