
ఉదయ్ కిరణ్(Uday Kiran) ..తెలుగు ప్రేక్షకులను పరిచయం అక్కర్లేని పేరు ఇది. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా చిత్ర పరిశ్రమలోకి వచ్చి.. తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా ఎదిగాడు. చిత్రం, నువ్వు నేను, మనసంతా నువ్వే, నీ స్నేహం, నీకు నేను నాకు నువ్వు, అవునన్నా కదన్నా.. లాంటి ఎన్నో ప్రేమ చిత్రాలను చేసి..యూత్కి ఫేవరేట్ హీరో అయ్యాడు. ఈ యంగ్ హీరో టాలీవుడ్ని కొన్నేళ్ల పాటు ఏలేస్తాడని అంతా అనుకున్నారు. కానీ కొన్నాళ్ల తర్వాత చేసిన సినిమాలు ఆశించిన స్థాయిలో ఆడకపోవడం..అవకాశాలు పెద్దగా రాకపోవడంతో మానసిక క్షోభకు గురై 33 ఏళ్ల వయసులో ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు.
ఆయన మరణంపై టాలీవుడ్లో అనేక రూమర్స్ ఉన్నాయి. కొంతమంది కావాలనే ఉదయ్కి అవకాశాలు రాకుండా చేశారని టాలీవుడ్లో టాక్ ఉంది. అయితే ఆయన ఆత్మహత్యకు సరైన కారణం ఏంటో తెలియదు కానీ..ఉదయ్ని దగ్గర నుంచి చూసిన ప్రతి ఒక్కరు.. ఆయనపై ప్రశంసలు కురిపిస్తారు. చాలా కష్టపడి పైకి వచ్చాడని చెబుతుంటారు. తాజాగా బిగ్బాస్ ఫేం కౌశల్ కూడా అదే చెప్పాడు. ఓ యూట్యూబ్ చానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ఉదయ్ కిరణ్తో తనకు మంచి అనుబంధం ఉండేదని.. అతను స్టార్గా ఎదిగేందుకు చాలా కష్టపడ్డాడని అన్నారు.
‘ఉదయ్ హీరో కాకముందే నాకు తెలుసు. ఆయనతో కలిసి నేను పదమూడు సినిమాలకు పైగా పని చేశాను. బేగంపేట్లో ఉండేవాడు. అప్పుడప్పుడు అతని ఇంటికి కూడా వెళ్లేవాడిని. ఇద్దరం కలిసి యాడ్ ఫిల్మ్స్కి పని చేశాం. చాలా కష్టపడి స్టార్ పొజిషిషన్కి వచ్చాడు. ఆటైంలో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి రావాలంటే ఎంత కష్టమో నాకు తెలుసు. చిన్న చిన్న సినిమాలు చేస్తున్న ఆయనకు చిత్రం మూవీతో మంచి బ్రేక్ వచ్చింది.అప్పటి వరకు ఆయన చాలా కష్టపడ్డాడు.
ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్న వాతావరణం చూస్తే.. ఆయన చనిపోయి మంచి పనే చేశాడని అనకూడదరు కానీ.. ఇలాంటి సమాజంలో బతకడమే వేస్ట్. ఒక మనిషి జీవితంలో కష్టపడి పై స్థాయికి వెళితే.. కిందకు లాగడానికే ట్రై చేస్తారు. దాని వల్ల వారికి ఎలాంటి ప్రయోజనం ఉండదు. కానీ అదొక ఆనందం. పైకి వెళ్లిన వారిని హింసించి.. మెసేజ్లు పెట్టి, ట్రోల్ చేసి..కిందకు లాగేద్దామనే ఆలోచనతోనే చాలా మంది ఉన్నారు’అని కౌశల్ అన్నారు.