హీరోలకు ఎంత వయసొచ్చినా హీరో పాత్రలు చేస్తూనే ఉంటారు. కానీ, హీరోయిన్ల పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉంటుంది. ఒక వయసొచ్చాక లేదా పెళ్లయ్యాక వారికి వచ్చే ఆఫర్లు, పాత్రలు కాస్త భిన్నంగానే ఉంటాయి. అలా ఒకప్పటి హీరోయిన్ భాగ్యశ్రీ తాజాగా మరాఠి చిత్రంలో తనకంటే కాస్త చిన్నవాడైన హీరోకి తల్లిగా నటించింది.
హీరోకు తల్లిగా..
రితేశ్ దేశ్ ముఖ్.. మరాఠా కింగ్ శివాజీగా నటించిన తాజా చిత్రం 'రాజా శివాజీ'. ఇందులో శివాజీ తల్లి జీజాబాయిగా భాగ్యశ్రీ యాక్ట్ చేసింది. ఈ సినిమా రూ.100 కోట్లపైనే కలెక్షన్స్ రాబట్టింది. అయితే వయసులో తనకంటే కేవలం 10 ఏళ్ల చిన్నవాడైన హీరోకు తల్లిగా నటించడంపై పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. దీని గురించి భాగ్యశ్రీ స్పందిస్తూ.. 'శివాజీ వంటి మహాయోధుల కథలను చిన్నప్పటి నుంచి వింటూ పెరిగాం.
ఆ ప్రశంస మర్చిపోలేను
అలాంటి సినిమాలో నటించే ఛాన్స్ వస్తే తిరస్కరించగలమా? పైగా జీజాబాయి కూడా యంగ్ మదరే! ఈ మూవీ సినిమాటోగ్రాఫర్ సంతోశ్ శివన్ సర్ నన్ను పిలిచి.. సారీ, మీరు చాలా యంగ్గా కనిపిస్తున్నారు. అందుకని నా కెమెరాతో మిమ్మల్ని కాస్త వయసుపైబడినదానిలా చూపిస్తాను అన్నారు. ఆ ప్రశంస నా మనసును తాకింది' అని చెప్పుకొచ్చింది.
సినిమా
రాజా శివాజీ సినిమా విషయానికి వస్తే.. రితేశ్ దేశ్ముఖ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఆయన భార్య జెనీలియాతో పాటు నిర్మాత జ్యోతి దేశ్పాండే నిర్మించారు. ఈ మూవీలో సంజయ్దత్, అభిషేక్ బచ్చన్, మహేశ్ మంజ్రేకర్, సచిన్ ఖేడ్కర్, ఫర్దీన్ ఖాన్, జెనీలియా తదితరులు కీలక పాత్రలు పోషించారు. భాగ్యశ్రీ విషయానికి వస్తే.. 1989లో మైనే ప్యార్ కియా సినిమాతో వెండితెరపై కథానాయికగా ఎంట్రీ ఇచ్చింది. హిందీలో అనేక సినిమాలు చేసింది.
చదవండి: కేన్స్ సంబరాలకు వీడ్కోలు


