Aishwarya Rajesh: 'తండ్రిని కోల్పోయా.. అన్నయ్యలు చనిపోయారు'

Aishwarya Rajesh Says She Struggled Alot During Her Childwood - Sakshi

చిన్నతనంలో ఐశ్వర్య రాజేష్‌ చాలా కష్టాలు పడిందట. పేరులో ఉన్న ఐశ్వర్యం తన జీవితంలో లేదని వ్యాఖ్యానించింది. ఇటీవల ఒక భేటీలో ఈ బ్యూటీ మాట్లాడుతూ.. ఎనిమిదేళ్ల వయసులోనే తండ్రిని కోల్పోయానని, రోడ్డు ప్రమాదంలో ఇద్దరు సోదరులు దుర్మరణం పాలయ్యారని తెలిపింది. జీవితం తనకు రకరకాల పాఠాలను నేర్పిందని, సినిమా రంగ ప్రవేశానికి ముందు ఆ తర్వాత కూడా దెబ్బ మీద దెబ్బ తగులుతూనే ఉన్నాయని వాపోయింది.

స్టార్‌ కథానాయకి పేరు రాకపోయినా పర్వాలేదనీ, మంచి నటి అన్న పేరు తెచ్చుకుంటే చాలన్నారు. తాను నటించిన చిత్రాలు ప్రేక్షకుల మనసులో పదికాలాలపాటు నిలిచిపోతే చేయాలన్నదే తన ఆశని వివరించింది. తమిళనాడులో స్థిరపడిన తెలుగు కుటుంబం నుంచి వచ్చిన ఐశ్వర్య తమిళ చిత్ర పరిశ్రమలో కథానాయికగా పేరు తెచ్చుకుంది. మాతృభాషలోనూ రాణిస్తోంది.

చిన్న చిన్న పాత్రలతోనే ఈమె కెరీర్‌ ప్రారంభమైంది. కాక్కా ముట్టై చిత్రం ఐశ్వర్య రాజేష్‌ కేరీర్‌ను మలుపు తిప్పింది. అందులో ఇద్దరు పిల్లల తల్లిగా ఆమె అద్భుత నటన విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఆ తరువాత వరుసగా కథానాయికగా అవకాశాలు తలుపు తట్టాయి. కనా వంటి హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ కథా చిత్రంల్లో నటించి తన నటనా సత్తాను చాటారు. ప్రస్తుతం తమిళంలో అరడజను చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top