‘నటి దుషారా విజయన్ నేను గట్టిగానే కొట్టుకున్నాం. నాకు బాగా దెబ్బలు తగిలాయి’ అని నటి అదితిబాలన్ అన్నారు. వీరిద్దరూ కలిసి నటించిన వెబ్ సిరీస్ ఎగ్జామ్. వాల్ వాచర్ పతాకంపై దర్శక నిర్మాతల ద్వయం పుష్కర్ –గాయత్రి నిర్మించిన ఈ వెబ్ సిరీస్కు కథ, దర్శకత్వం బాధ్యతలను సద్గుణం నిర్వహించారు. ఇది ప్రైమ్ వీడియో ఒరిజినల్ వెబ్ సిరీస్ అన్నది గమనార్హం. అబ్బాస్ ముఖ్యపాత్ర పోషించిన 7 ఎపిసోడ్స్తో రూపొందిన ఈ సిరీస్ మే 15వ తేదీ నుంచి ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.
గురువారం మధ్యాహ్నం చెన్నైలోని ప్రసాద్ ల్యాబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో పాల్గొన్న దుషారా విజయన్ మాట్లాడుతూ నేను ఇంతకు ముందు నటించిన సార్పట్ట పరంపరై చిత్రం ప్రైమ్ వీడియో ఓటీటీలోనే స్ట్రీమింగ్ అయ్యింది. ఆ తరువాత తాజాగా నటించిన ఎగ్జామ్ వెబ్ సిరీస్ అదే ఓటీటీలో స్ట్రీమింగ్ కానుండడం సంతోషంగా ఉంది. ఇందులో నటించడానికి ఎలాంటి ఆలోచన లేకుండా ఒప్పేసుకున్నాను. ఇందులో నేను ఝాన్సీ అనే పోలీస్ అధికారిగా నటించాను.
అదితిబాలన్ మాట్లాడుతూ తన పాత్ర మొదట్లో కొంచెం నెగిటివ్గా కనిపిస్తుంది. ఇప్పటికి అంతకంటే ఎక్కువ చెప్పలేను. ఈ సిరీస్లో చాలా ఫైట్ సన్నివేశాలు చోటు చేసుకుంటాయి. నేను, దుషారా విజయన్ కొట్టుకున్నాం. చాలా దెబ్బలు కూడా తగిలాయి అని చెప్పారు. మధ్య తరగతి ప్రజల పెద్ద కల ప్రభుత్వ కొలువుల ఎంపిక. అందులో జరిగే అక్రమాలను ఆవిష్కరించే ఇతివృత్తంతో తెరకెక్కించిన సిరీస్ ఇది అని దర్శకుడు సర్గుణం పేర్కొన్నారు.


