ఓ ఆటోడ్రైవర్ తనతో దురుసుగా ప్రవర్తించాడంటూ బాలీవుడ్ హీరోయిన్ షమీమ్ అక్బర్(Shamim Akbar Alli) పోలీసులకు ఫిర్యాదు చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తన కూతురు ముందే తనను అసభ్యపదజాలంతో దూషించాడని..అంతేకాకుండా నా చేయిపట్టుకొని గట్టిగా లాగాడంటూ ఫిర్యాదులో పేర్కొంది. నటి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న ముంబై పోలీసులు.. విచారణ చేపట్టారు
అసలేం జరిగింది?
ఫిర్యాదులో ఉన్న వివరాల ప్రకారం..‘ఇన్ ది మంత్ ఆఫ్ జూలై’ ఫేం షమీమ్ అక్బర్ అల్లీ(32)కి ఐదేళ్ల కూతురు ఉంది. ఈ నెల 1న తన కూతురుని స్కూల్ నుంచి తీసుకురావడానికి ముంబైలోని మైరా రోడ్లో ఉన్న తన నివాసం ముందు ఆటోని ఆపింది. మధ్యాహ్నం 2.45 గంటల సమీపంలో ఆమె ఆటో ఎక్కి స్కూల్ దగ్గరకు వెళ్లింది. అక్కడ ఆటో ఆపమని చెప్పగానే..అప్పటికే చిరాకుగా ఉన్న డ్రైవర్..ఇక్కడ ఎందుకు ఆపావని ఆమెపై ఫైర్ అయ్యాడు. తనకు అర్జెంట్ పని ఉందని.. వెంటనే కిరాయి ఇవ్వమని డిమాండ్ చేశాడు. ఆమె మాత్రం డబ్బులు ఇవ్వకుండా..స్కూల్లో ఉన్న తన కూతురుని తీసుకొని మళ్లీ అదే ఆటో ఎక్కి ఇంటివద్ద డ్రాప్ చేయమని చెప్పింది.
ఇంటి గేట్ వద్దకు చేరుకోగానే..ఆమె కూతురు ఫౌంటేన్ ఏరియా చుట్టు ఒక రౌండ్ తిరగమని కోరింది. అయితే అప్పటికే డ్రైవర్ కోపంగా ఉండడంతో.. ‘మనం వేరే ఆటోలో వెళదాం లే’ అంటూ చిన్నారిని తీసుకొని హీరోయిన్ దిగబోయింది. డ్రైవర్ ఒక్కసారిగా ఆమెపై గట్టిగా అరిచాడు. వెనక్కి తిరిగి దిగబోతున్న హీరోయిన్ చేయిని పట్టుకొని గట్టిగా లాగాడు. కూతురు ముందే తనపై దుర్భాషలాడాడు.
డ్రైవర్ కోసం గాలింపు!
సదరు డ్రైవర్పై నటి సీరియస్ అవ్వడంతో అక్కడ నుంచి వెళ్లిపోయాడు. సాయంత్రం ఆమె కాశీమీరా పోలీసు స్టేషన్లో ఆ డ్రైవర్పై ఫిర్యాదు చేసింది. తన కూతురు ముందే తనతో దురుసుగా ప్రవర్తించిన డ్రైవర్పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఆటో రిజిస్ట్రేషన్ నంబర్ ద్వారా డ్రైవర్ వివరాలను తెలుసుకున్నారు. ప్రస్తుతం విచారణ కొనసాగుతుందని..త్వరలోనే డ్రైవర్ని అదుపులోకి తీసుకుంటామని పోలీసులువెల్లడించారు. నటి షమీమ్ అక్బర్ ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్నారు. కానీ సోషల్ మీడియా ద్వారా మాత్రం అభిమానులతో టచ్లోనే ఉంటున్నారు.


