సౌత్లోని భారీ బడ్జెట్ సినిమాలకు బాలీవుడ్ హీరోయిన్లను తీసుకోవడం ఈ మధ్య పరిపాటి అయిపోయింది. అయితే దక్షిణాదిలో టాలెంట్ నిరూపించుకుంటున్న భామలకు బాలీవుడ్ నుంచి కూడా పిలుపొస్తోంది. అందుకు యంగ్ బ్యూటీ శ్రీలీల పెద్ద ఉదాహరణ.. హిందీ హీరో కార్తీక్ ఆర్యన్కు జంటగా ఓ సినిమా చేస్తోంది. తాజాగా మరో సౌత్ బ్యూటీకి బాలీవుడ్ నుంచి పిలుపు వచ్చిందని ప్రచారం జరుగుతోంది. ఆ హీరోయిన్ మరెవరో కాదు రుక్మిణి వసంత్..
నాలుగేళ్లు గ్యాప్
2019లో బీర్బర్ ట్రయాలజీ మూవీతో కన్నడలో ఎంట్రీ ఇచ్చింది రుక్మిణి. అదే ఏడాది అప్స్టార్స్ అనే హిందీ మూవీలో యాక్ట్ చేసింది. ఈ చిత్రం తనకు ఏమాత్రం ఉపయోగపడలేదు. దీంతో నాలుగేళ్ల గ్యాప్ తర్వాత సప్త సాగరదాచె ఎల్లో అనే కన్నడ సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
తెలుగులో డ్రాగన్
ఈ సినిమా తెలుగులో సప్తసాగరాలు దాటి టైటిల్తో విడుదలై మంచి స్పందన రాబట్టింది. దీని సీక్వెల్ కూడా సక్సెస్ అవడంతో పాటు రుక్మిణి అందానికి అందరూ ఫిదా అయ్యారు. మధ్యలో కొన్ని సినిమాలు చేసినా పెద్దగా మెప్పించలేకపోయింది. కాంతార: చాప్టర్ 1 చిత్రంతో మరోసారి సెన్సేషన్గా మారింది. ప్రస్తుతం ఈ బ్యూటీ యష్ 'టాక్సిక్', ఎన్టీఆర్ 'డ్రాగన్' సినిమాలు చేస్తోంది.
బాలీవుడ్ నుంచి పిలుపు
బాలీవుడ్ నుంచి తనకు ఆఫర్లు వస్తున్నట్లు ఫిల్మీదునియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ఈ క్రమంలో రుక్మిణి (Rukmini Vasanth) మాట్లాడుతూ.. చిన్నప్పటినుంచి హిందీ సుపరిచితమైన భాషే అంది. ఒక బాలీవుడ్ సినిమా గురించి చర్చలు జరుగుతున్నాయని.. భగవంతుడి దయ ఉంటే త్వరలోనే ఆ ప్రయాణాన్ని ప్రారంభిస్తాను అని ఆశాభావం వ్యక్తం చేసింది.


