లోటునుంచి సాధారణ వర్షపాతం నమోదు
ముమ్మరంగా సాగుతున్న వ్యవసాయ పనులు
ఇప్పటివరకు 1.47లక్షల ఎకరాల్లో సాగు
జిల్లావ్యాప్తంగా ఈ వానాకాలంలో 3.67 లక్షల ఎకరాలల్లో వివిధ రకాల పంటలు సాగవుతాయని అధికారుల అంచనా. ఇందులో 3.5 లక్షల ఎకరాల్లో వరి సాగవుతుందని మిగతా 62 వేల ఎకరాలలో పత్తితోపాటు కూరగాయలు, వర్షాధార పంటలు సాగు కానున్నట్లు అధికారుల పేర్కొన్నారు. అందుకు తగ్గట్టుగా విత్తనాలు, ఎరువులు సిద్ధంగా ఉంచారు. కానీ ఈ ఏడాది ఎల్నినో ముప్పు పొంచి ఉందని, దీర్ఘకాలిక పంటలైన వరికి బదులు స్వల్పకాలిక పంటలు సాగు చేసుకోవటం మేలని అధికారులు విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నారు. కానీ ఇప్పటికే వర్షాధార పంటలు పత్తి, కంది, మొక్కజొన్న తదితర కూరగాయల పంటలను సాగు చేయగా, బోరుబావుల ఆధారంగా నారుమళ్లు పోసిన రైతులు అడపాదడపా కురిసిన వర్షపు నీటికి తోడు బోరుబావుల నీటితో కొంతమేర నాట్లు కూడా వేసేశారు. కానీ జూన్లో లోటు వర్షపాతం నమోదవటంతో అన్నదాతలు ఆందోళన చెందుతుండగా, ఇటీవల కురుస్తున్న వర్షాలతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
లోటునుంచి సాధారణం వరకు..!
ఎల్నినో ప్రభావంతో గత నెల లోటువర్షపాతం నమోదైంది. జూన్లో 112.4 మి.మీటర్ల వర్షం కురవాల్సి ఉండగా 83.8 మి. మీటర్ల వర్షం మాత్రమే కురిసింది. ఈ లెక్కన కురవాల్సిన దాని కన్నా 28.6 మి.మీటర్ల వర్ష తక్కువగా నమోదైంది. దీంతో అధికారులు ఎల్నినో ముప్పు తప్పించుకునేందుకు ఆరుతడి పంటలనే సాగు చేయాలని విస్తృతంగా అవగాహన కల్పిస్తున్న నేపథ్యంలో గత వారం రోజులుగా జిల్లాలో వర్షాలు కురుస్తున్నాయి. జూలైలో ఇప్పటివరకు 189.3 మి. మీటర్ల వర్షం కురవాల్సి ఉండగా ఇప్పటి వరకు 219.4 మి. మీటర్ల వర్షం కురిసింది. ఈ లెక్కన కురవాల్సిన దాని కన్నా 30.1 మి.మీటర్ల వర్షం అధికంగా కురిసింది. కాగా జూన్, జూలైల్లో 304.2 మీ.మీటర్ల వర్షం కురవాల్సి ఉండగా, 301.7 మి. మీటర్ల వర్షం కురిసింది. అంటే 2.5 మి. మీటర్ల వర్షం మాత్రమే తక్కువ పడింది. కాగా 20 మి.మీటర్ల వరకు ఎక్కువ, తక్కువ నమోదైనా సాధారణ వర్షపాతం కిందకే వస్తోందని సంబంధిత వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. కాగా ఇప్పటి వరకు 1.47,185 ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగయాయ్యియని అధికారులు వెల్లడించారు.
వారంరోజలుగా కురుస్తున్న వర్షాలు అన్నదాతలకు పట్టలేని ఆనందాన్ని కలిగిస్తున్నాయి. ఇప్పటికే బోరుబావుల ఆధారంగా నారుమళ్లు పోసి రైతులు దుక్కులు దున్ని ఆకాశం వైపు వర్షాలకోసం ఎదురు చూశారు. అంతేకాకుండా వర్షాధారంగా సాగు చేసిన పంటలకు నీటితడులు లేక ఎండుముఖం పట్టిన నేపథ్యంలో వరుణుడు చూపిన కరుణతో పంటలకు ఊపిరి పోసినట్లైంది. ఫలితంగా వ్యవసాయ పనులు జోరుగా సాగుతున్నాయి. మెదక్జోన్:
వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు జిల్లాలో మధ్యతరహా సాగునీటి ప్రాజెక్టు పొంగి పొర్లుతోంది. సోమవారం రాత్రి జిల్లా వ్యాప్తంగా 38.5 మి.మీటర్ల వర్ష పాతం నమోదు కాగా చేగుంట మండలంలో అత్యధికంగా 41.మి.మీటర్ల వర్షం కురిసింది. అలాగే పెద్దశంకరంపేటలో 27, మాసాయిపేటలో 21 మి.మీటర్ల వర్షం కురిసింది. దీంతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. పుష్పలవాగులోకి వరద తాకిడి మొదలైంది. వ్యవసాయ పనులు జోరుగా సాగుతున్నాయి. ఈ వానల నేపథ్యంలో అన్నదాతలు వరిసాగుకే మొగ్గు చూపుతున్నారు.
పొంగి పొర్లుతున్న ఘనాపూర్ ప్రాజెక్టు


