(లక్షల్లో) (లక్షల్లో)
కొలతలు సరిపోకపోతే కూడా...
పనిచేయకుండా ఫొటోలు దిగి వెళ్తే అంతే..
ఇక నుంచి ఉపాధి పనుల్లో అక్రమాలకు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)తో చెక్ పడనుంది. ఏఐ వినియోగంతో పనులు చేయకుండా తప్పుడు బిల్లులు పెట్టడం, పనికి వచ్చినా పనిచేయకుండానే ఫొటోలు దిగి వెళ్లే వారి ఆటలు ఇక సాగవు. వీబీజీరాంజీ పథకంలో ఏఐ వినియోగాన్ని ఇప్పటికే తీసుకురావడంతో జరిగిన అక్రమాలు బయటపడుతున్నాయి. – సాక్షి, సిద్దిపేట
సిద్దిపేట జిల్లా చిన్నకోడూురు మండలంలో ఉపాధి పనులపై సామాజిక తనిఖీలు మంగళవారం మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించారు. పలుచోట్ల పనులు చేయకున్నా చేసినట్లుగా నమోదు, తప్పుడు బిల్లులు పెట్టడం, పనులు ఎక్కువగా నమోదు చేయడాన్ని తనిఖీ బృందం గుర్తించింది. రూ.90 వేలు రికవరీ చేయాలని, రూ.44వేలు జరిమానాను విధించారు. అలాగే ఉపాధి పనులు చేయకుండానే చేశామని ఫొటోలు దిగి వెళ్లే వారికి, బోగస్ పనులకు బ్రేక్లు పడుతున్నాయి. ఉపాధి పనులు ప్రారంభమైనప్పటి నుంచి ప్రతీ ఏడాది పనులపై సామాజిక తనిఖీలు నిర్వహిస్తున్నారు. తప్పుగా నమోదు చేసిన తర్వాత తనిఖీల్లో గుర్తించడం కంటే వెంటనే గుర్తించేందుకు సాంకేతికను వినియోగిస్తున్నారు. జూలై 1 నుంచి వీబీజీరాంజీ పథకంలో అక్రమాలకు తావులేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. బోగస్ పనులను నిరోధించి, నిజాయితీగా చేసిన కూలీలనే గుర్తించేలా ఏఐను ప్రవేశపెట్టారు. దీంతో ఉపాధి పనులు పారదర్శకంగా జరగనున్నాయి. ఉమ్మడి మెదక్ జిల్లావ్యాప్తంగా 5.7లక్షల జాబ్ కార్డులుండగా 10.93లక్షల మంది కార్మికులున్నారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా జలసిరి కార్యక్రమంలో భాగంగా ఫామ్పాండ్స్ను నిర్మిస్తున్నారు.
గ్రామాల్లో కొందరు కూలీలు, మేస్త్రులు కలిసి చేసే తప్పులను అధికారులు గుర్తించారు. ఉదయం 8 గంటలకు, మధ్యాహ్నం 2గంటలకు వచ్చి ఫొటోలు దిగి వెళ్లిపోవడం, మధ్యలో అసలు పనే ముట్టకపోవడం వంటి మోసాలు జరిగేవి. ప్రస్తుతం అమల్లోకి వచ్చిన వ్యవస్థతో పని జరగకపోతే ఏఐ ఆటోరిజెక్ట్ చేస్తుంది. ప్రతీ ఒక్కరు నాలుగు గంటల పాటు పని చేయాలి. దీని ప్రకారం ఉదయం, మధ్యాహ్నం తీసిన ఫొటోలను క్లౌడ్ సర్వర్లోని ఏఐ సాఫ్ట్వేర్ సెక్షన్లలో పోల్చి చూస్తుంది. ఉదయం ఉన్న మట్టి కుప్ప లేదా కాల్వ మధ్యాహ్నం ఫొటోలో కూడా ఎలాంటి మార్పు లేకుండా ఉంటే పనిలో పురోగతి లేదని, అక్కడ పని జరగలేదని గుర్తించి ఆ రోజు హాజరును ఆటోమేటిక్గా నిలిపివేస్తుంది.
జిల్లా జాబ్ కార్డులు కార్మికులు
సిద్దిపేట 1.96 3.87
మెదక్ 1.64 3.27
సంగారెడ్డి 2.1 3.79
డిజిటల్ కొలతలు, ఏఐ రిపోర్టులకు భిన్నంగా ఎంబుక్ రాసే అధికారులపై నేరుగా విచారణ జరగనుంది. ఇస్రో భువన్ పోర్టల్ శాటిలైట్ చిత్రాలతోపాటు ప్రతీ జిల్లా అంబుడ్స్మెన్కు డ్రోన్ నిఘా వ్యవస్థను కేటాయించారు. సిబ్బంది కార్యాలయాల్లో కూర్చుని తప్పుడు బిల్లులు రాస్తే శాటిలైట్, డ్రోన్ డేటాలోని వాస్తవ కొలతలతో సరితూగదు. తేడా వస్తే సదరు సిబ్బంది ఐడీలు నిలిచిపోవడమే కాకుండా రికవరీకి క్రిమినల్ కేసులు నమోదవుతాయి. కూలీలు రాకపోయినా వారి పాత ఫొటోలను వేరే మొబైల్ స్క్రీన్పై చూపిస్తూ రీ ఫొటోలు తీసి మోసం చేసే ఫీల్డ్ ట్రిక్స్ను ఏఐ పట్టేస్తుంది.
4 గంటలు తప్పక పనిచేయాల్సిందే
ఉపాధి కార్మికులు ప్రతీ ఒక్కరు నాలుగు గంటలు పని చేయాలి. ఆ నాలుగు గంటల పాటు చేసే పని పురోగతి ఉండాలి. ఉదయం రాగానే చేసే పని దగ్గర ఫొటో దిగాలి. తర్వాత చేసిన పని దగ్గర ఫొటో దిగాలి. అలాగే చేసిన పనికి సంబంధించిన ఫొటో సైతం తీసి అప్లోడ్ చేయాలి. వీబీజీరాంజీ సర్వర్ ద్వారా పనులను ఏఐ పరిశీలిస్తుంది. అన్ని సక్రమంగా ఉంటేనే హాజరు వేస్తుంది.
–జయదేవ్ ఆర్యా, డీఆర్డీఏ, సిద్దిపేట


