పటాన్చెరు: భారత వైమానిక దళం (ఐఏఎఫ్)లో అధికారులు లేదా అగ్నివీరులుగా చేరి దేశ సేవలో భాగస్వాములు కావాలని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం విద్యార్థులకు మాస్టర్ వారెంట్ ఆఫీసర్ దీపక్ భరద్వాజ్ పిలుపునిచ్చారు. ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని రుద్రారం గీతం క్యాంపస్లో మంగళవారం నిర్వహించిన ‘భారత వైమానిక దళ నియామకం: అభివృద్ధి వాహనం–వృత్తి మార్గదర్శనం’కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. యూపీఎస్సీ, ఏఎఫ్క్యాట్, ఎన్సీసీ స్పెషల్ ఎంట్రీల ద్వారా పర్మినెంట్ లేదా షార్ట్ సర్వీస్ కమిషన్తో ఐఏఎఫ్ లో చేరే అవకాశాలను వివరించారు. ఫ్లయింగ్, టెక్నికల్, గ్రౌండ్ డ్యూటీ విభాగాల్లో అర్హతలు, ఎంపిక విధానం, ఐఎఫ్ఎస్బీ పరీక్షల ప్రక్రియపై అవగాహన కల్పించారు. ఆకర్షణీయమైన వేతనం, వైద్య సదుపాయాలు, నివాసం, బీమా, విద్య, సాహస కార్యకలాపాలు వంటి ప్రయోజనాలను వివరించారు. కార్యక్రమంలో ఐఏఎఫ్ మొబైల్ ఎగ్జిబిషన్, సిమ్యులేషన్ సౌకర్యం విద్యార్థులను ఆకట్టుకున్నాయి. ఏరోస్పేస్ ఇంజనీరింగ్ విభాగాధిపతి ప్రొఫెసర్ వేణుకుమార్ నాతి అతిథులను సత్కరించగా, డాక్టర్ మహమ్మద్ అక్తర్ ఖాన్ వృత్తి అవగాహన కార్యక్రమాల ప్రాధాన్యాన్ని వివరించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు పాల్గొన్నారు.
ఐఏఎఫ్ అధికారి దీపక్ భరద్వాజ్


