అల్లాదుర్గం(మెదక్): ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఆగస్టు నుంచి అన్ని రకాల వైద్య పరీక్షలు తిరిగి ప్రారంభమవుతాయని జిల్లా వైద్యాధికారి (డీఎంహెచ్ఓ) గణేశ్వర్ స్పష్టం చేశారు. అల్లాదుర్గం పీహెచ్సీని మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ...పలు రకాల రక్త పరీక్షలు ప్రతీరోజు నిర్వహించి రోగులకు సకాలంలో వైద్య సేవలు అందించనున్నామన్నారు. రక్త పరీక్షలు తీసుకెళ్లే వారి కాంట్రాక్టు పూర్తికావడంతో కొన్ని నెలల నుంచి ఆగిపోయినట్లు చెప్పారు. ప్రతీ ఆరోగ్య కేంద్రంలో సీజనల్ వ్యాధులకు సంబంధించిన మందులు అందుబాటులో ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుత వర్షాకాలంలో ప్రజలు వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. డాక్టర్తోపాటు సిబ్బంది సమయపాలనతో విధులు నిర్వహించాలని ఆయన సూచించారు. గర్భిణీలు, బాలింతలకు ఆశావర్కర్లు, ఆరోగ్య సిబ్బందితో ఫోన్ చేయించి ఎప్పటికప్పుడు వివరాలు తెలుసుకుని వైద్యం అందిస్తున్నట్లు చెప్పారు. ఇందులో డాక్టర్ సారిక, సీహెచ్ఓ సుదర్శన్, ఆరోగ్య సిబ్బంది ఉన్నారు.
డీఎంహెచ్ఓ గణేశ్వర్


