నిజాంపేట(మెదక్): మండల పరిధి కల్వకుంట గ్రామంలోని రైతుల వేదికలో బుధవారం కేతి బచావో అభియాన్ కార్యక్రమంలో భాగంగా కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త శ్రీకాంత్ ఖరీఫ్ సీజన్లో రైతులు చేపట్టాల్సిన సస్యరక్షణ చర్యలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అధిక మోతాదులో ఎరువుల వాడకం వల్ల జరిగే నష్టాలు, రసాయనిక ఎరువులు బదులు ప్రత్యామ్నాయ ఎరువులు, బయో ఫెర్టిలైజర్స్, నానో యూరియా, నానో డీఏపీపై అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు. రైతులు పంట వ్యర్థాలను కాల్చడం వల్ల నేల స్వభావం దెబ్బతిని పంట దిగుబడి తగ్గే ఆస్కారం ఉందన్నారు. రైతులు స్వల్ప కాలిక పంటలైన పెసలు, మినుములు, కంది పంటలను సాగు చేయడం శ్రేయస్కరమన్నారు. కార్యక్రమంలో వ్యవసాయ అధికారి సోమలింగారెడ్డి, వ్యవసాయవిస్తరణ అధికారులు శ్రీలత, రమ్య, మౌనిక రైతులు పాల్గొన్నారు.


