మెదక్ అర్బన్: విద్యార్థుల్లో ఉత్సుకత.. సృజనాత్మకత.. ఊహశక్తి ద్వారా ఆవిష్కరణలు సృష్టించడానికి ప్రారంభించిన అటల్ టింకరింగ్ ల్యాబ్ కార్యక్రమం నీరుగారి పోతుంది. జిల్లాలో ఒక్కో పాఠశాలకు పంపిణీ చేసిన రూ.10 లక్షల సామగ్రి నిరుపయోగంగా మారింది. పాపన్నపేట మండలంలోని ఓ పీఎంశ్రీ పాఠశాలలో డ్రోన్ మాయం కాగా, విద్యార్థులకు ఉపయోగపడాల్సిన ట్యాబ్లు పక్కదారి పడుతున్నాయి. ఓ ట్యాబ్ సైతం కనిపించకుండా పోవడంతో పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ఏటీఎల్ సామగ్రి పంపిణీ చేసి ఏడాది కావొస్తున్నా, కొన్ని పాఠశాలల్లో ఇప్పటివరకు స్టాక్ రిజిస్టర్లో నమోదు చేయకపోవడం గమనార్హం.
ఆవిష్కరణలతో అద్భుతం
విద్యార్థి దశ నుంచే ఆవిష్కరణలు, విమర్శనాత్మక ఆలోచన, లెర్నింగ్ బై డూయింగ్ విధానాన్ని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం నీతి ఆయోగ్ యొక్క అటల్ ఇన్నోవేషన్ మిషన్ కింద ఏర్పాటు చేసిందే ‘అటల్ టింకరింగ్ ల్యాబ్’ కార్యక్రమం. జిల్లాలో 31 పీఎంశ్రీ స్కూల్స్ ఉన్నాయి. ఇందులో 28 పాఠశాలల్లో ఏటీఎల్ ల్యాబ్లు ఉండగా, ఏడాది క్రితం సుమారు రూ. 10 లక్షల విలువ గల సామగ్రి పంపిణీ చేశారు. ఇందులో రోబోటిక్స్ కిట్, ఎలక్ట్రానిక్ డెవలప్మెంట్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, రాపిడ్ ప్రోటో టైపింగ్ టూల్స్, మెకానికల్ అండ్ మెజర్మెంట్ టూల్స్, పవర్ సప్లై, ఆక్ససరీస్ అండ్ సేఫ్టీ ఎక్విప్మెంట్ కాంపోనెంట్ కింద 150 రకాల వస్తువులు పంపిణీ చేశారు. అయితే వీటిని వినియోగించేందుకు సంబంధిత టీచర్లకు రెండు రోజుల శిక్షణ సైతం ఏర్పాటు చేశారు. ఈ వస్తువులలో చాలా మట్టుకు ఇంజనీరింగ్ సిలబస్కు సంబంధించినవి ఉన్నట్లు టీచర్లు చెబుతున్నారు. ఒకటి రెండు రోజుల శిక్షణలో వాటిపై అవగాహన వచ్చే అవకాశం లేదని వాపోతున్నారు. ఇక ఇంతటి విలువైన వస్తువులను కొన్ని పాఠశాలల్లో హెచ్ఎంలు కనీసం ఇన్చార్జిలకు బాధ్యత అప్పజెప్పకపోవడంతో స్టాక్ రిజిస్టర్లో ఎంట్రీకి నోచకోలేక నిరుపయోగంగా మారాయి. కాగా వాటిపై ఎవరి అజమాయిషి లేకపోవడంతో ఎవరికి వారు విలువైవ వస్తువులను ఇంటికి తీసుకెళ్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఈ క్రమంలోనే ట్యాబ్లు, డ్రోన్లు మాయమవుతున్నట్లు తెలుస్తోంది.
మాయమవుతున్న డ్రోన్లు.. పక్కదారి పడుతున్న ట్యాబ్లు
రూ.10 లక్షల ల్యాబ్ సామగ్రి వృథా
జిల్లాలో 33 పాఠశాలలకు పంపిణీ
పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్లు అవసరం
ఏటీఎల్ ల్యాబ్ కింద పంపిణీ చేసిన ల్యాబ్ సామగ్రి వినియోగంలోకి రావాలంటే నిరుద్యోగ ఇంజనీరింగ్ విద్యార్థులను పాఠశాలల్లో పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్లుగా నియమించాలని పలువురు టీచర్లు అభిప్రాయపడుతున్నారు. తమకు వాటిపై పూర్తి అవగాహన లేనందున ప్రోగ్రామింగ్ లాంటివి తయారు చేయడం కష్టమని అంటున్నారు.


