ఆత్మలకు ఓట్లు.. తొలగని పొరపాట్లు
● ఓటరు జాబితాలో
150 మంది మృతుల పేర్లు
● జారీ కానున్న ఓటర్ స్లిప్లు
రామాయంపేట(మెదక్): ఓటరు జాబితాలో వందల సంఖ్యలో మృతుల పేర్లు ఉన్నాయి. నాలుగేళ్ల క్రితం మరణించిన వారి పేర్లు సైతం ఫొటోలతో జాబితాలో ప్రచురితమయ్యాయి. వీరందరికీ త్వరలో ఓటర్ స్లిప్లు జారీ కానున్నాయి. మున్సిపాలిటీ పరిధిలోని కోమటిపల్లి గ్రామస్తులు రెండో వార్డులో ఉండగా, పట్టణంలోని ఒకటో వార్డుకు చెందిన సుమారు 125 మంది పేర్లు రెండో వార్డులో ఉన్నాయి. ముసాయిదా ఓటరు జాబితా విడుదల సమయంలో వార్డు ప్రజలు ఫిర్యాదు చేసినా, సమస్య పరిష్కారం కాలేదు. అలాగే హరిజనకాలనీ వాసులు తరలివచ్చి తమను ఏడో వార్డు నుంచి తొలగించి యథావిధిగా ఒకటో వార్డులోనే ఉంచాలని ఫిర్యాదు చేశారు. అయినా సమస్య పరిష్కారం కాలేదు. పట్టణంలోని 12 వార్డుల్లో మొత్తం 13,095 ఓటర్లు ఉండగా, వీరిలో 6,291 మంది పురుషులు, 6,804 మంది మహిళలు ఉన్నారు. అన్నివార్డుల్లో కలిపి సుమారుగా 150 మందికి పైగా మృతుల పేర్లు ఓటరు జాబితాలో చోటు చేసుకున్నాయి.
మచ్చుకు కొన్ని..
నాలుగో వార్డులోని 145 సీరియల్ నంబర్పై నమోదైన ఎండీ గోరేమియా నాలుగేళ్ల క్రితమే మృతిచెందారు. అతని పేరు, ఫొటో జాబితాలో ప్రచురితమైంది.
ఇదే వార్డులోని 698 నంబర్పై నమోదైన పోచమ్మల రాజవ్వ రెండేళ్ల క్రితం మృతిచెందారు.
నాలుగో వార్డులోని 702 నంబర్పై నమోదైన పోచమ్మల నర్సవ్వ ఏడాదిన్నర క్రితం మృతిచెందారు.
ఇదే వార్డులోని 930 నంబర్పై నమోదైన డాకి లక్ష్మి రెండేళ్ల క్రితమే మృతి చెందింది.
పదో వార్డులో సీరియల్ నంబర్ 183లో నమోదైన రొయ్యల పోచయ్య రెండేళ్ల క్రితమే మృతి చెందింది.
పదో వార్డులోని 858 నంబర్లో ఉన్న బచ్చు భూమయ్య ఏడాది క్రితమే మృతి చెందారు.
పదో వార్డులోని 570 నంబర్పై నమోదైన మర్కు సత్యనారాయణ నాలుగేళ్ల క్రితమే మృతి చెందాడు.
ఐదో వార్డులోని 1006 నంబర్లో ఉన్న పాండురంగనాఽథ్ ఐదేళ్ల క్రితమే మృతి చెందారు. వీరందరూ ప్రస్తుత ఓటరు జాబితాలో నమోదై ఉన్నారు.


