
జనారణ్యంలోకి జాతీయ పక్షి
చిన్నశంకరంపేట(మెదక్): వనంలో ఉండాల్సిన జాతీయ పక్షి నెమలి జనారణ్యంలోకి వచ్చింది. శనివారం రాత్రి నార్సింగి మండల కేంద్రంలోని రైతు వెంకట్రెడ్డి పశువుల పాకలోకి వచ్చి అరవడంతో గమనించిన రైతు పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో పోలీసులు వల్లూర్ అటవీశాఖ అధికారులను పిలిపించి నెమలిని అప్పగించగా.. వారు వల్లూర్ అడవిలో వదిలిలారు.
దివ్యాంగులకు
మరింత ప్రోత్సాహం
మెదక్ కలెక్టరేట్: ప్రభుత్వం దివ్యాంగులకు మరింత ప్రోత్సాహం అందజేస్తుందని డీడ బ్ల్యూఓ హైమావతి ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇద్దరు దివ్యాంగులు పెళ్లి చేసుకుంటే కల్యాణలక్ష్మితో పాటు రూ. లక్ష వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నట్లు చెప్పారు. గతంలో ఇద్దరు దివ్యాంగులు పెళ్లి చేసుకుంటే ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రోత్సాహం ఉండేది కాదన్నారు. ఇక నుంచి పెళ్లి చేసుకున్న జంటలో ఇద్దరూ దివ్యాంగులైనా, ఒకరు అయినా కల్యాణలక్ష్మితో పాటు రూ. లక్ష మంజూరు చేయనున్నట్లు తెలిపారు. ప్రభుత్వం నుంచి జారీ చేసిన ధ్రువీకరణ పత్రం కలిగి ఉండాలన్నారు. వధువు 18, వరుడు 21 ఏళ్లు నిండి ఉండాలని పేర్కొన్నారు.
నూతన పోస్టాఫీస్
భవనాన్ని నిర్మించండి
జోగిపేట(అందోల్): నూతన పోస్టాఫీస్ భవనం నిర్మించాలని జోగిపేట ఏఎంసీ మాజీ చైర్మన్ గంగ జోగినాథ్ కేంద్ర మంత్రి కిషన్రెడ్డిని కోరారు. ఈ మేరకు ఆదివారం హైదరాబాద్లో ఆయనను కలిసి వినతిపత్రం అందజేశారు. పట్టణంలోని పోస్టాఫీస్ భవనం నిర్మి ంచి చాలా ఏళ్లు కావడంతో శిథిలావస్థకు చేరిందన్నారు. నూతన భవన నిర్మాణానికి అవసరమైన నిధులు మంజూరు చేయించాలని విజ్ఞప్తి చేశారు. నూతన భవన నిర్మాణం కోసం సంబంధిత మంత్రికి సిఫారసు చేయించి నిధులు విడుదల చేయిస్తానని హామీ ఇచ్చినట్లు తెలిపారు.
నిరుద్యోగులకు ఉచిత శిక్షణ
సంగారెడ్డి టౌన్: నిరుద్యోగులకు సీసీ కెమెరా సర్వీసింగ్పై ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు స్టేట్ బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ డైరెక్టర్ వంగ రాజేంద్రప్రసాద్ ఆదివారం ఒక ప్రకటనలో చెప్పారు. సంగారెడ్డి, మెదక్ జిల్లాలోని 18 నుంచి 45 ఏళ్ల పురుషులకు ఈనెల 24వ తేదీ నుంచి 13 రోజుల పాటు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఆసక్తి ఉన్నవారు 9490103390, 9490129839 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. శిక్షణ కాలంలో పూర్తిగా ఉచిత భోజనంతో పాటు వసతి కల్పిస్తామన్నారు. శిక్షణ అనంతరం సర్టిఫికెట్లను అందజేస్తామని పేర్కొన్నారు.
ఆయిల్పామ్ సాగుతో
అధిక లాభాలు
వెల్దుర్తి(తూప్రాన్): రైతులు ఆయిల్పామ్ సాగు చేసి అధిక లాభాలు పొందవచ్చని రాష్ట్ర ఆయిల్పామ్ టెక్నికల్ అడ్వైజర్ రంగనాయకులు అన్నారు. ఆదివారం మండలంలోని ఎలుకపల్లి శివారులో రైతు సత్యనారాయణగౌడ్ వ్యవసాయ క్షేత్రంలోని తోటలను పరిశీలించి మాట్లాడారు. ఆయిల్పామ్ సాగుతో నీటి ఆదాతో పాటు అంతర్గత పంటలు సాగు చేసుకొని అధిక లాభాలు పొందవచ్చన్నారు. దేశవ్యాప్తంగా 259 లక్షల టన్నుల ఆయిల్పామ్ వాడకం జరుగుతుంటే, కేవలం 97 లక్షల టన్నుల ఉత్పాదన మాత్రమే జరుగుతుందన్నారు. దీంతో కేంద్ర ప్రభుత్వం ఆయిల్పామ్ సాగుకు అత్యధికంగా సబ్సిడీ ఇస్తుందని, రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా మేనేజర్ కృష్ణారావు, డిప్యూటీ మేనేజర్ అశోక్ కుమార్, రైతులు తదితరులు పాల్గొన్నారు.

జనారణ్యంలోకి జాతీయ పక్షి

జనారణ్యంలోకి జాతీయ పక్షి