ఆదిలాబాద్టౌన్: పశువులను రోడ్లపై వదిలిపెడితే యజమానులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్.జీవన్ రెడ్డి హెచ్చరించారు. ఎస్పీ ఆదేశాల మేరకు మంగళవారం పోలీసు శాఖ, మున్సిపల్ అధికారుల సంయుక్త ఆధ్వర్యంలో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని ప్రధాన రహదారులపై ట్రాఫిక్కు అంతరాయం కలిగిస్తూ, వాహనదారులకు ప్రమాదకరంగా మారిన 22 పశువులను గుర్తించి ఇచ్చోడ గోశాలకు తరలించారు. గోశాలలో పశువులు ఉన్నన్ని రోజుల నిర్వహణ ఖర్చును సంబంధిత య జమానులే భరించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. నిర్లక్ష్యంగా పశువులను రోడ్లపై వదిలిపెట్టిన దుర్గానగర్కు చెందిన కై లాష్, ఖానాపూర్కు చెందిన అహ్మద్ ఖాన్, సాజిత్ ఖాన్తో పాటు మరికొందరు యజమానులపై ఆదిలాబాద్ వన్టౌన్ పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. గతంలో రోడ్లపై సంచరించే పశువుల కారణంగా చిరు వ్యాపారులు, కూరగాయల విక్రేతలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని, ఒక ఘటనలో కూరగాయల వ్యాపారి కొట్టడంతో ఆవు మృతి చెందగా, ఆ ఘటన శాంతిభద్రతల సమస్యలకు దారితీసిందని గుర్తుచేశారు. కార్యక్రమంలో వన్టౌన్ సీఐ సునీల్ కుమార్, మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్గౌడ్, తదితరులు పాల్గొన్నారు.


