పాతమంచిర్యాల: భవిష్యత్ తరాలకు నీటి భద్రత, నీటి కొరతను తీర్చడానికి భూగర్భ జలాల పెంపుకోసం రాష్ట్ర ప్రభుత్వం ‘జలసిరి’ కార్యక్రమం ద్వారా నీటి నిలువ కార్యక్రమాలు చేపడుతోంది. వర్షపు నీరు వృధాకాకుండా వ్యవసాయానికి పనికి వచ్చేలా రైతుల పంట పొలాల్లో ఫారంపాండ్లు, ఊటకుంటలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ‘ఇంటింటా ఇంకుడు గుంత, ప్రతీ పొలానికి పంటకుంట, ప్రతీ ఊరికి చెక్డ్యాం’ అనే నినాదంతో ప్రతీ గ్రామ పంచాయతీలో నీటి సంరక్షణ పనులు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. డిసెంబర్లోగా పనులు పూర్తి చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందుకోసం జిల్లాలోని 306 గ్రామ పంచాయతీల్లో ప్రతీ జీపీకి 200 ఇంకుడు గుంతలు, సామూహిక ఇంకుడుగుంత 1, ప్రతీ మండలానికి రెండు సేద్యపు బావులు ఏర్పాటు చేయనున్నారు. ఒక్కో బావి నిర్మాణానికి రూ.2 లక్షలు ఖర్చుకాగా బోర్వెల్ రీచార్జ్ స్ట్రక్చర్లు జీపీకి ఒకటి, ఫారం పాండ్లు జీపీకి 4 ఏర్పాటు చేయనున్నారు. ఒక్కో ఫారం పాండ్ నిర్మాణానికి రూ.2 లక్షలు వ్యయం చేయనున్నారు. రూఫ్టాప్ హార్వెస్టింగ్ వర్షపు నీరు వృధా కాకుండా రూ.35 వేల వ్యయంతో ఇంకుడు గుంతలు నిర్మించనున్నారు. వీటితో పాటు రాతి కట్టడాలు, ఖండిత కందకాలు, నిరవధిక సమతల కందకాలు, నీటి శోషణ కందకాల నిర్మాణాలు చేపట్టనున్నారు. జిల్లాలోని 16 మండలాలు, 306 గ్రామ పంచాయతీల్లో 1,408 ఫారంపాండ్లు, 306 ఊట కుంటలు, 61,200 ఇంకుడు గుంతలు, 306 సామూహిక ఇంకుడు గుంతలు, 306 బోర్వెల్ రిచార్జ్ స్ట్రక్చర్లు, 32 సేద్యపు బావుల నిర్మాణాలు చేపట్టనున్నారు. జలసిరి ద్వారా నీటి సంరక్షణ, వ్యవసాయ ఉత్పాదకత, పర్యావరణ పరిరక్షణ, గ్రామీణ జీవనోపాధిని మెరుగుపర్చడానికి జల సంరక్షణ కార్యక్రమం ఎంతగానో ఉపయోగ పడతుందని అధికారులు తెలిపారు. వీబీజీ రాంజీ, ప్రధాన మంత్రి కృషి సంచాయ్యోజన, నాబార్డు, ఎన్జీవో, కార్పొరేట్ సామాజిక బాధ్యత నిధులు (సీఎస్సార్) రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల సంస్థల నిధులతో పనులు చేపట్టనున్నారు.


