నార్నూర్: మూడు నెలల వ్యవధిలో తల్లిదండ్రులను కోల్పోయిన ఇద్దరు చిన్నారులు అనాథలుగా మారారు. మండలంలోని మాలేపూర్ పంచాయతీ పరిధి చిత్తగూడలో ఈ ఘటన చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నీడంపూర్ సోనుబాయి (28), తిరుపతి దంపతులు. మూడు నెలల క్రితం మద్యానికి బానిసై తిరుపతి మూడునెలల క్రితం ఇంద్రవెల్లి మండలం ముత్నూర్లో ఉరేసుకున్నాడు. అప్పటి నుంచి సోనుబాయి తన ఇద్దరు చిన్నారులతో కలిసి తండ్రి గంటేవార్ సాదవ్ ఇంట్లో ఉంటోంది. ప్రస్తుతం ఆమె 8 నెలల గర్భిణి. భర్త మృతితో మానసిక వేదనకు గురైన సోనుబాయి, ఇద్దరు చిన్నారుల భవిష్యత్ గురించి ఆలోచిస్తూ దిగులుగా ఉండేది. శుక్రవారం రాత్రి ఇంట్లో అందరూ నిద్రిస్తున్న సమయంలో ఆమె మరో గదిలోకి వెళ్లి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. నాడు తండ్రి, నేడు తల్లి మృతితో ఇద్దరు చిన్నారులు అనాథలుగా మారడం గ్రామస్తులను కలచివేసింది. మృతురాలి తల్లి రంజానబాయి ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీసాయి తెలిపారు. చిన్నారుల సంరక్షణ, భవిష్యత్కు ప్రభుత్వం, దాతలు, స్వచ్ఛంద సంస్థలు అండగా నిలవాల్సిన అవసరం ఉందని గ్రామస్తులు కోరుతున్నారు.


