శ్రీరాంపూర్: ఎస్ఆర్పీ 3 గనిలో మోసిన్ అనే ఓవర్మెన్ వైఖరిపై కార్మికులు ఆందోళన చేపట్టారు. శుక్రవారం ఉదయం షిఫ్ట్లో కార్మికులు గనిపై నిరసన తెలిపారు. వారు మాట్లాడుతూ మోసిన్ తమను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. పని స్థలాల వద్ద అకారణంగా దుర్భాషలాడుతున్నారని, ఇదేమని ప్రశిస్తే దిక్కున్న చోట చెప్పుకోండంటూ బెదిరిస్తున్నారని కార్మికులు వాపోయారు. కార్మికులంతా కలిసి ఆందోళన చేయడంతో గని మేనేజర్, ఇతర అధికారులు వచ్చి వారికి సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. కార్మికులు వినిపించుకోకుండా ఆందోళన కొనసాగించారు. మోసిన్ కార్మికుల ముందుకు వచ్చి బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. చివరికి మేనేజర్ రెండు రోజుల్లో సమస్య పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో కార్మికులు ఆందోళన విరమించారు. కార్మికుల ఆందోళనలకు ఏఐటీయూసీ నేతలు మద్దతు తెలిపారు. ఏఐటీయూసీ డిప్యూటీ ప్రధాన కార్యదర్శులు కందికట్ల వీరభద్రయ్య, ముస్కే సమ్మయ్య, బ్రాంచీ సెక్రెటరీ షేక్బాజీసైదా, ఫిట్ సెక్రెటరీ మురళీ చౌదరీ, నాయకులు మల్లేశ్, నగేశ్, సాగర్, మహేశ్, రమేశ్, రాజయ్య, గోపి, రాజయ్య పాల్గొన్నారు.


