చర్యలు చేపట్టనున్న అధికారులు జిల్లా కేంద్రంలో రోడ్ల మీదే మూగజీవాల సంచారం ఇబ్బందులు పడుతున్న ప్రజలు వారం గడువిచ్చిన కమిషనర్ జి.అన్వేష్
మంచిర్యాలటౌన్: జిల్లా కేంద్రంలోని ప్రధాన రహదారులపై రాత్రి, పగలు అనే తేడా లేకుండా పశువులు సంచరిస్తుండడంతో వాహనదారులు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో రోడ్లపైకి పశువులను వదలకుండా నగరపాలక సంస్థ అధికారులు చర్యలు చేపడుతున్నారు. నగర పాలక సంస్థ పరిధిలోని పశువుల యజమానులు వారికి చెందిన ఆవులు, గేదెలను నగరంలో విచ్ఛలవిడిగా వదిలివేయవద్దని, ఇందుకు వారం రోజుల సమయం ఇస్తున్నామని నగర కమిషన్ జి.అన్వేష్ తెలిపారు. పశువులను ఇంటి ఆవరణలో కానీ తగిన సురక్షిత ప్రదేశంలో కానీ కట్టేసుకోవాలని పేర్కొన్నారు. వారం తరువాత పశువులను రోడ్ల మీదకు వదిలేస్తే వాటిని నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో పట్టుకుని, గోశాలలకు తరలిస్తామన్నారు.
అనేక తిప్పలు..
జిల్లా కేంద్రంలోని ప్రధాన రహదారులపై రాత్రి, పగలు అనే తేడా లేకుండా పశువులు సంచరించడంతో పాటు రోడ్లపైనే పడుకుంటున్నాయి. దీంతో వాహనదారులు, రోడ్డుపై వెళ్లే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పట్టణంలోని తోళ్లవాగు నుంచి శ్రీనివాస గార్డెన్ వరకు పశువులు నిత్యం రోడ్లపైనే మకాం వేస్తుండడంతో ట్రాఫిక్ సమస్య తలెత్తుతోంది. ఐబీచౌరస్తా, బెల్లంపల్లి చౌరస్తా, లక్ష్మీ టాకీస్ చౌరస్తా, పాతమంచిర్యాల, సీసీసీ నస్పూర్ చౌరస్తాలో ట్రాఫిక్కు తరుచూ అంతరాయం కలిగిస్తున్నాయి. ఇటీవల రోడ్డుపై ఉన్న పశువులను వాహనదారులు ఢీకొట్టి గాయపడిన సంఘటనలు అనేకం చోటు చేసుకుంటున్నాయి. మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు పట్టింపు లేకుండా వ్యవహరించడంతో ప్రజల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఈనేపథ్యంలో పశువుల బెడద నివారించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.


