రామకృష్ణాపూర్: స్థానిక రవీంద్రఖని రైల్వేస్టేషన్లో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పోలీసులు మంగళవారం స్వాధీనం చేసుకున్నారు. స్టేషన్ నుంచి బియ్యం అక్రమంగా తరలిస్తున్నారన్న సమాచారం మేరకు పట్టణ ఎస్సై శ్రీధర్ ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. సుమారు 5 క్వింటాళ్ల బియ్యం స్వాధీనం చేసుకుని.. తరలిస్తున్న ముగ్గురు మహిళలపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
స్కానర్ కోడ్తో ఇటుకల వ్యాపారికి టోకరా
రామకృష్ణాపూర్: మందమర్రి మండలం బొక్కలగుట్ట గ్రామానికి చెందిన ఓ ఇటుకల వ్యాపారి సైబర్ మోసగాళ్ల వలలో చిక్కుకుని రూ.40 వేల నగదు కోల్పోయాడు. పట్టణ ఎస్సై శ్రీధర్ తెలిపిన వివరాల ప్రకారం.. మహారాష్ట్రకు చెందిన వ్యక్తినని పరిచయం చేసుకున్న ఓ గుర్తు తెలియని వ్యక్తి ఈ నెల 16న ఫోన్ చేసి తాను పాఠశాల నిర్మాణం చేపడుతున్నానని ఇందుకు పెద్ద మొత్తంలో ఇటుకలు అవసరమని తెలిపాడు. నమ్మకం కల్పించిన సదరు వ్యక్తి ఇటుకల సరఫరాకు ముందుగా రూ.40వేల అడ్వాన్స్ పంపిస్తానని చెప్పాడు. అనంతరం ఓ స్కానర్ పంపిస్తూ దానిని స్కాన్ చేసి పిన్ నంబరు నమోదు చేస్తే రూ.40వేల అడ్వాన్స్ మీ ఖాతాలో జమ అవుతుందని నమ్మించాడు. అతడి మాటలు నమ్మిన ఇటుకల వ్యాపారి క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి పిన్ నమోదు చేయగా రావాల్సిన డబ్బుకు బదులు అతని ఖాతా నుంచే రూ.40 వేలు వెళ్లాయి. మోసానికి గురయ్యానని గుర్తించిన బాధితుడు మంగళవారం పోలీసులను ఆశ్రయించాడు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
గుడుంబా పట్టివేత
మందమర్రిరూరల్: మందమర్రి పట్టణంలోని ప్రశాంతినగర్ ఏరియాకు చెందిన ఎల్లమ్మ ఇంట్లో పోలీసులు మంగళవారం గుడుంబా పట్టుకున్నారు. బ్లూ కోల్ట్స్ కానిస్టేబుల్ రాజేందర్ తనిఖీ చేసి ఐదు లీటర్ల గుడుంబా స్వా ధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్య ప్తు చేస్తున్నారు. గుడుంబా క్రయవిక్రయాలు నేరమని, చట్టపరమైన చర్యలు తప్పవని ఎస్సై నరేష్ తెలిపారు.


