తాండూర్: మండలంలోని అచ్చలాపూర్ గ్రామ శివారులో ప్రమాదవశాత్తు నిప్పంటుకొని ట్రాక్టర్ ట్రాలీ దగ్ధమైన ఘటన ఆదివారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన బామండ్లపల్లి సంతోష్ నల్లవాగు సమీపంలోని తన పొలం నుంచి ట్రాక్టర్లో గడ్డి తీసుకొని ఇంటికి వస్తుండగా విద్యుత్ తీగలు గడ్డికి తగిలి మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన ట్రాక్టర్ డ్రైవర్ ట్రాక్టర్ ఇంజన్, ట్రాలీని వేరు చేశారు. సమాచారం అందుకున్న బెల్లంపల్లి అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటన స్థలానికి చేరుకొని మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే ట్రాలీ చాలా వరకు కాలిపోయింది. విద్యుత్ తీగల నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన విద్యుత్ అధికారులపై చర్యలు తీసుకొని ప్రభుత్వపరంగా ఆదుకోవాలని బాధితుడు కోరుతున్నాడు.


