దండేపల్లి: కొనుగోలు కేంద్రాల్లో తూకం వేసిన ధాన్యం బస్తాలు మిల్లులకు తరలించేందుకు సరిపడా లారీలను వెంటనే పంపించాలని ట్రాన్స్పోర్టు కాంట్రాక్టర్తో పాటు, రవాణా శాఖ అధికారులను జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య ఆదేశించారు. దండేపల్లి మండలంలోని పలు వరి, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను డీఆర్డీవో కిషన్తో కలిసి ఆదివారం సందర్శించారు. కొనుగోలు కేంద్రాల నిర్వాహకులతో పాటు, పలువురు రైతులు లారీల సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో వెంటనే ఆయన లారీ ట్రాన్స్పోర్టు కాంట్రాక్టర్, రవాణాశాఖ అధికారులతో ఫోన్లో మాట్లాడారు. లారీలు ఎన్ని ఉంటే అన్ని పంపాలని, ఒకవేళ అందుబాటులో లేకుంటే రోడ్ల వెంట ఖాళీగా వెళ్తున్న వాటిని ఆపి, కొనుగోలు కేంద్రాలకు పంపించాలన్నారు. అకాల వర్షాలు కురిస్తే బస్తాలు తడిసిపోయేలా ఉన్నాయన్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ సమస్యలుంటే పరిష్కరించాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఆయన వెంట తహసీల్దార్ రోహిత్ దేశ్పాండే, ఎంపీడీవో జాగర్లమూడి ప్రసాద్, ఎంపీవో కే.వీ ప్రసాద్, ఐకేపీ సిబ్బంది ఉన్నారు.


