మంచిర్యాలటౌన్: దేశంలోనే మొట్టమొదటి ఇంటర్నేషనల్ ఫిష్పాండ్ మంచిర్యాలకు వచ్చిందని, దీంతో మత్స్య సంపద అభివృద్ధి చేయడంతోపాటు రాష్ట్రానికి కావాల్సిన చేపల విత్తన ఉత్పత్తి చేయడం జరుగుతుందని, జాతీయస్థాయిలోనే మంచిర్యాలకు ఒక గొప్ప గుర్తింపు లభించిందని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్రావు అన్నారు. జిల్లా కేంద్రంలోని తన నివాసంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. నియోజకవర్గంలోని ఎల్లంపల్లి ప్రాజెక్టు వద్ద ఇంటర్నేషనల్ ఫిష్ పాండ్ ఏర్పాటుకు నిధులు, 85.10 ఎకరాలు కేటాయింపు పూర్తయిందని అన్నారు. ఫిష్పాండ్ ఏర్పాటుతో 100 నుంచి 150 మంది మత్స్యకారులకు నేరుగా ఉపాధి లభిస్తుందని అన్నారు. మొట్టల పెంపకం, చేప పిల్లల విత్తన ఉత్పత్తి చేసి రాష్ట్రం మొత్తం సరఫరా చేస్తారని తెలిపారు. గూడెం సత్యనారాయణ స్వామి ఆలయం అభివృద్ధికి రూ.70 కోట్లు మంజూరుకు ఆమోదం వచ్చిందని, అన్నవరానికి దీటుగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని చెప్పారు. గోదావరి పుష్కరాల నేపథ్యంలో మంచిర్యాలలోని విశ్వనాథ ఆలయానికి రూ.10 కోట్ల నిధులకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందన్నారు. బీజేపీ ధాన్యం కొనుగోలుపై రాద్ధాంతం చేస్తోందని విమర్శించారు. మాజీ ఎమ్మెల్యేకు మంచిర్యాల అభివృద్ధి నచ్చడం లేదని, మహాప్రస్థానంతోపాటు ఇండస్ట్రియల్ పార్కు పనులు అడ్డుకునేందుకే పూర్తి సమయాన్ని కేటాయిస్తున్నారని అన్నారు. మంచిర్యాల మేయర్ ధర్ని మధుకర్, డిప్యూటీ మేయర్ సల్ల రమ్య పాల్గొన్నారు.


