నస్పూర్: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో మ్యాపింగ్ ప్రక్రియ పకడ్బందీగా చేపట్టాలని స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్, ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం మంచిర్యాల పరిశీలకులు ఆర్.దశరథ్ అన్నారు. బుధవారం నస్పూర్లోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆయన జిల్లా అదనపు కలెక్టర్ రాములు, ఆర్డీఓ శ్రీనివాస్రావు, ప్రత్యేక ఉప పాలనాధికారి చంద్రకళతో కలిసి అన్ని మండలాల తహసీల్దార్లు, ఎన్నికల విభాగం అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా దశరథ్ మాట్లాడుతూ ప్రత్యేక సవరణ కార్యక్రమంలో మ్యాపింగ్ శాతాన్ని పెంపొందించడం అత్యవసరమని తెలిపారు. 2002 ఓటరు జాబితా ఆధారంగా మ్యాపింగ్ ప్రక్రియ పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. ఫారం 6, 7, 8 ద్వారా అందిన దరఖాస్తులు నిబంధనల ప్రకారం పరిశీలించి పరిష్కరించాలని తెలిపారు. మరణించిన, ఇతర ప్రాంతాలకు మారిన ఓటర్ల వివరాలను ధ్రువీకరించి తొలగించడం లేదా సవరించాలని సూచించారు. ఓటరు జాబితా సమగ్ర కార్యక్రమంపై ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నారు. కార్యక్రమం విజయవంతానికి అధికారులు, సిబ్బంది సమన్వయంతో కృషి చేయాలని తెలిపారు.


