పెంచికల్పేట్: నీటి గుంతలో పడి బాలుడు మృతి చెందిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. బాధిత కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు కాగజ్నగర్ మండలం గన్నారం గ్రామానికి చెందిన రజిత, సంతోష్ దంపతుల కుమారుడు దోబే మహేష్ (13) వేసవి సెలవుల నేపథ్యంలో చేడ్వాయిలోని అమ్మమ్మ ఇంటికి వచ్చాడు. మంగళవారం సాయంత్రం తోటి స్నేహితులతో కలిసి ఇంటినుంచి బయటకు వెళ్లిన బాలుడు తిరిగిరాలేదు. కుటుంబ సభ్యులు బంధువుల ఇళ్లలో వెతికినా ఆచూకీ లభించలేదు. బుధవారం ఉదయం గ్రామంలోని రైతు వేదిక వెనుక ఉన్న నీటి గుంతలో మృతదేహం గమనించిన స్థానికులు బాధిత కుటుంబ సభ్యులు, పోలీసులకు సమాచారం అందించారు. కాగజ్నగర్ రూరల్ సీఐ కుమారస్వామి, పెంచికల్పేట్ ఎస్సై అనిల్ కుమార్ సంఘటన స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని పంచనామ నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. . మృతుని తల్లి రజిత ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.


