వాంకిడి: మద్యం తాగడం మానేయాలని మందలించినందుకు మనస్తాపానికి గురై ఒకరు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. ఎస్సై మహేందర్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని ఖమాన గ్రామానికి చెందిన తపాసె నాందేవ్ (46) కొన్ని రోజులుగా మద్యానికి బానిసయ్యాడు. మంగళవారం రాత్రి మద్యం తాగి ఇంటికి వచ్చిన నాందేవ్ను కుటుంబ సభ్యులు మందలించారు. మనస్తాపానికి గురై రాత్రి ఇంటి నుంచి బయటికి వెళ్లిపోయాడు. కుటుంబ సభ్యులు వెతుకుతుండగా గ్రామ శివారులోని పంటచేలలో పడిపోయి కన్పించాడు. నోట్లో నుంచి నురుగు రావడంతో పురుగుల మందు తాగినట్లు గుర్తించారు. మృతుని భార్య పిసుబాయి ఇచ్చిన ఫిర్యాదు మేరకు బుధవారం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.


