జన్నారం: ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లిన కార్మికుల సంక్షేమం కోసం పోరాడుదామని తెలంగాణ గల్ఫ్ కార్మికుల సంక్షేమ సమితి రాష్ట్ర అధ్యక్షుడు కల్లెడ భూమన్న అన్నారు. మంగళవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం గల్ఫ్ కార్మికులకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని ఆరోపించారు. ఉపాధి కోసం వివిధ దేశాలకు వెళ్లిన 1900 పైగా గల్ఫ్ కార్మికులు ఉపాధి వేటలో మృతి చెందారన్నారు. మృతుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా ఇచ్చినప్పటికీ గల్ఫ్ బోర్డు ఏర్పాటు చేయకపోవడంతో నష్టపోవాల్సి వస్తుందన్నారు. గల్ఫ్ దేశాల నుంచి ఇంటికి తిరిగి వచ్చిన కార్మికులకు ఆసరా పెన్షన్ అందజేయాలని కోరారు. సమావేశంలో రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు సేపూరి గోపాల్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు అమరగొండ తిరుపతి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెరుగు మల్లికార్జున్, మండల అధ్యక్షుడు మగ్గిడి తిరుపతి, ప్రధాన కార్యదర్శి దుమ్మల ఎల్లయ్య, తదితరులు పాల్గొన్నారు.


