పాతమంచిర్యాల: దళితుల సంక్షేమం, అభివృద్ధి కోసం ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర కార్యదర్శి మారుపాక అనిల్కుమార్ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని సీపీఐ కార్యాలయంలో డీహెచ్పీఎస్ 2వ జిల్లా మహాసభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అంబేడ్కర్ అభయహస్తంకు నిధులు విడుదల చేయాలన్నారు. నూతన జిల్లా కమిటీని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్, డీహెచ్పీఎస్ జిల్లా కార్యదర్శి దేవి పోచన్న, జిల్లా బాధ్యులు దాగం మల్లేష్, వనం సత్యనారాయణ, బొంతల లక్ష్మినారాయణ, గుండా చంద్రమాణిక్యం, నక్క వెంకట స్వామి, జిల్లా కౌన్సిల్ సభ్యులు, ఆఫీస్బేరర్లు పాల్గొన్నారు.
ఆభరణాలు అపహరణ
నిర్మల్చైన్గేట్: నిర్మల్ బస్టాండ్లో గుర్తు తెలియని వ్యక్తులు మహిళ బ్యాగు నుంచి బంగారు ఆభరణాలు అపహరించిన ఘటన మంగళవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. నిజామాబాద్ జిల్లాకు చెందిన ఓ మహిళ మూడు రోజుల క్రితం నిర్మల్లోని బంధువుల ఇంటికి వచ్చింది. తిరుగు ప్రయాణంలో మంగళవారం నిర్మల్ బస్టాండ్కు వెళ్లి బస్సు ఎక్కే క్రమంలో గుర్తు తెలియని వ్యక్తులు ఆమె బ్యాగులోని 3 తులాల బంగారు ఆభరణాలు అపహరించారు. బస్సు బయల్దేరిన తర్వాత కొంతసేపటికి ఈ విషయం గుర్తించిన ఆమె, బంధువుల సహకారంతో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
మందుబాబులకు జైలు శిక్ష
ఆదిలాబాద్టౌన్: మందుబాబులకు కోర్టు జైలు శిక్ష విధించడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. మద్యం సేవించి వాహనాలు న డుపుతున్న వారిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. కోర్టులో హాజరుపర్చగా ఆదిలాబాద్ ప్రిన్సిపల్ జేఎఫ్సీఎం జడ్జి భుక్య హుస్సేన్ బుధవారం తీర్పునిచ్చారు. మొత్తం 19 మందిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు కాగా, జడ్జి 13 మందికి మూడు రోజుల పాటు, ఆరుగురికి రెండు రోజుల పాటు జైలు శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చినట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. 17 మందిపై ట్రాఫిక్ పోలీసుస్టేషన్లో, ఇద్దరిపై వన్టౌన్లో కేసులు నమోదైనట్లు చెప్పారు. మద్యం సేవించి వాహనాలు నడపవద్దని సూచించారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.


