శ్రీరాంపూర్: శ్రీరాంపూర్ ఏరియాలో తీసుకుంటున్న పర్యావరణ పరిరక్షణ చర్యలను కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ అధికారులు పరిశీలించారు. బుధవారం ఆ శాఖ సలహాదారు తరుణ్ కత్తుల పర్యావరణ అధికారులు, ఏరియా జీఎం ఎం.శ్రీనివాస్తో కలిసి పరిశీలన చేశారు. ఏరియాలోని ఆర్కే 6, ఎస్సార్పీ 3, ఐకే 1ఏ గని పరిసర ప్రాంతాలు, కృష్ణ కాలనీ, శ్రీరాంపూర్ ఏరియాలోని మైదానాలు, ఎవెన్యూ ప్లాంటేషన్, సోలార్ ల్యాంప్లు, ట్రావెలింగ్ రోడ్లు, వాటి పక్కన పెరిగిన ప్లాంటేషన్, కాలనీల్లోని పార్కులు, ఇంకుడుగుంతలు సందర్శించారు. గనులపై ఫిల్టర్ బెడ్లను తనిఖీ చేసి పర్యావరణ పరిరక్షణ చర్యలపై అడిగి తెలుసుకున్నారు. అనంతరం జీఎం కార్యాలయంలో అధికారులు శ్రీరాంపూర్ ఏరియాలో పర్యావరణ పరిరక్షణ కోసం తీసుకుంటున్న అన్ని చర్యలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ కార్యక్రమంలో ఇందారం ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టు అధికారి ఏవీ రెడ్డి, ఏజెంట్లు శ్రీధర్, రవికుమార్, డీజీఎం(సివిల్) ఆనంద్కుమార్, కార్పొరేట్ ఎన్విరాన్మెంటు అధికారులు శ్రీనివాస్, సునీల్, సురేష్, ఏరియా క్వాలిటీ మేనేజర్ వెంకటేశ్వర్రెడ్డి, ఏరియా ఎన్విరాన్మెంటు అధికారి హనుమాన్గౌడ్, సెక్యూరిటీ అధికారి జక్కారెడ్డి పాల్గొన్నారు.


