కుభీర్: మండలంలోని నిగ్వా గ్రామానికి చెందిన జాదవ్ మోహన్(45) అనే వ్యక్తి ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందినట్లు ఎస్సై శ్రీనివాస్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాలు.. మహారాష్ట్రలోని కోల్గాం గ్రామానికి చెందిన జాదవ్ మోహన్ గత కొన్ని సంవత్సరాలుగా నిగ్వాలో ఉండి పాలేరుగా పనులు చేస్తున్నాడు. ఆదివారం గేదెలు మేపడానికి వెళ్లి ఇంటికి తిరిగిరాలేదు. కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఉదయం సుద్దవాగులో వెతకగా వాగు గట్టున చెప్పులు, నీళ్లలో మృతదేహం లభ్యమైంది. భార్య దేవికాబాయి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. మృతుడికి కుమారుడు ఉన్నారు.
ఉరేసుకొని వృద్ధురాలి ఆత్మహత్య
నస్పూర్: ఒంటరి జీవితాన్ని భరించలేక మానసిక ఒత్తిడికి గురైన ఓ వృద్ధురాలు ఇంటిలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన సీసీసీ నస్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సోమవారం ఎస్సై ప్రశాంత్ తెలిపిన వివరాల ప్రకారం మహారాష్ట్రలోని బల్లార్షకు చెందిన పల్లపు సుబ్బమ్మ(70) బతుకు దెరువు కోసం సీసీసీలోని ఆర్టీసీ కాలనీలో ఓ హోటల్లో పని చేస్తూ తన జీవనాన్ని కొనసాగిస్తుంది. ఈ క్రమంలో వృద్ధురాలు నివాసం ఉంటున్న ఇంటి నుంచి దుర్వాసన రావడంతో చుట్టు పక్కల వారు సోమవారం స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చి చూడగా ఇంటిలో ఉరేసుకోగా మృతదేహం పూర్తిగా కుళ్లిపోయి దుర్వాసన వస్తోంది. సుమారు మూడు రోజుల క్రితం ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు. మృతురాలికి ముగ్గురు కూతుళ్లు, ఇద్దరు కుమారులు ఉన్నారు. కూతురు స్వాతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ప్రశాంత్ తెలిపారు.
బైక్ కొనివ్వలేదని యువకుడు..
కడెం: బైక్ కొనివ్వలేదని మనస్తాపానికి గురైన ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కడెం మండలంలో చోటుచేసుకుంది. ఎస్సై సాయి కిరణ్ తెలిపిన కథనం ప్రకారం.. మండలంలోని సారంగాపూర్ గ్రామానికి చెందిన పోతరాజు రాకేశ్ (27) తన తండ్రి రమేశ్ను పొలాలకు వెళ్లడానికి బైక్ కొనివ్వాలని కోరాడు. కుటుంబ పరిస్థితుల కారణంగా బైక్ కొనివ్వలేకపోయారు. దీంతో మనస్తాపానికి గురైన రాకేశ్ ఆదివారం సాయంత్రం పొలానికి వెళ్తానని చెప్పి గోదావరి ప్రాంతానికి వెళ్లి చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యుల సమాచారం మేరకు పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఖానాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


