మంచిర్యాలఅర్బన్: జిల్లాలోని ప్రభుత్వ జూని యర్ కళాశాలల్లో విద్యార్థుల ఆకలి తీరనుంది. మధ్యాహ్న భోజన పథకం అమలుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వచ్చే విద్యాసంవత్సరం 2026–27 నుంచి అమలు చేయనున్నట్లు సీఎం రేవంత్రెడ్డి శుక్రవారం అసెంబ్లీలో ప్రకటించారు. కళాశాలలు నియోజకవర్గ, మండల కేంద్రాల్లో ఉన్నాయి. దీంతో దూర ప్రాంత విద్యార్థులు ఉదయాన్నే వస్తుండడంతో భోజ నం తెచ్చుకునే పరిస్థితి ఉండదు. ఆకలితో తరగతులకు హాజరు కాలేక మధ్యాహ్నం ఇంటికి వెళ్లాల్సి వస్తోంది. దీంతో డ్రాపౌట్లు పెరిగిపోవడం, విద్యార్థుల హాజరు శాతం తగ్గడం జరుగుతోంది. ఈ నేపథ్యంలో మధ్యాహ్న భోజన పథకం నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో విద్యార్థులకు ఊరట కలుగనుంది. జిల్లాలోని మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూర్ నియోజకవర్గాల్లో 10 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉన్నాయి. మొదటి సంవత్సరం 2,433, రెండో సంవత్సరం 1,676మంది విద్యార్థులు ఉన్నారు. ఐదేళ్లుగా కళాశాలల్లో మధ్యాహ్న భోజనంపై పాలకులు ప్రకటనలు చేస్తూ వస్తున్నారు. వచ్చే విద్యాసంవత్సరం నుంచి అమలు కానుండడంతో విద్యార్థుల ఆకలి తీరి కళాశాలల్లో సంఖ్యతో పాటు హాజరు శాతం పెరిగే అవకాశం ఉంది.
సీఎం చిత్రపటానికి పాలాభిషేకం
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పథకం విస్తరించడంపై ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల సంఘం (జీజేఎల్ఏ) హర్షం వ్యక్తం చేసింది. శుక్రవారం మంచిర్యాల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో స్పాట్ వాల్యూయేషన్ కేంద్రం వద్ద ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల, కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాల అధ్యక్షులు విజిత్కుమార్, ఆసిఫ్, జిల్లా ఇంటర్ విద్యాధికారి అంజయ్య, ప్రభుత్వ జూనియర్ కళాశాలల ప్రిన్సిపాల్ అసోసియేషన్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మణ్రావు తదితరులు పాల్గొన్నారు.


