మామిడి రైతుల ఆశలు ఆవిరి!
చెన్నూర్రూరల్: ఈ ఏడాది మామిడి చెట్లకు పూత బాగా వచ్చి రైతులను మురిపించింది. దిగుబడిపై ఎంతో ఆశలు పెంచుకున్నారు. కానీ వాతావరణ మార్పుల కారణం, అకాల వర్షం కురవడంతో పూతతోపాటు అక్కడక్క ఏర్పడ్డ పిందెలు కూడా రాలిపోయాయి. దీంతో వారి ఆశలు ఆవిరయ్యాయి. ఎక్కడో ఒక దగ్గర మాత్రమే పూత మిగిలి ఉంది. జిల్లా వ్యాప్తంగా సుమారు 18వేల ఎకరాలకు పైగా మామిడి తోటలను సాగు చేస్తున్నారు. బెల్లంపల్లి, నెన్నెల, ఆవుడం, చిత్తాపూర్, భీమారం, చెన్నూర్ మండలాల్లో అధికంగా తోటలు ఉన్నాయి. వర్షాలకు కొన్నిచోట్ల పూత రాలడం దిగుబడిపై ప్రభావం చూపుతుండడంతో రైతులు ఆందోళనలో ఉన్నారు.
అక్కడక్కడే మిగిలిన పూత
డిసెంబర్ చివరి నుంచి మామిడి పూత రావాల్సి ఉంటుంది. అదే విధంగా పూత బాగా వచ్చింది. పూతకు తేనె మంచు పురుగు ఆశించడంతో పురుగు నివారణకు మందులను స్ప్రే చేశారు. ఒక్కో చోట పిందెలు వస్తున్నాయి. ఈ క్రమంలో అకాల వర్షాలు కురవడంతో పూత, పిందెలు రాలిపోయాయి. అక్కడక్కడ మాత్రమే పూత మిగిలిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షం కారణంగా మామిడి పూత రాలిందని చెన్నూర్కు చెందిన మల్లేశ్ ఇటీవల ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఏటా గాలులు, అకాల వర్షాలతో మామిడి కాయలు నేల రాలిపోతున్నా, పరిహారం అందడం లేదని పలువురు పేర్కొంటున్నారు. దీనికి తోడు మార్కెట్ సౌకర్యం లేకపోవడంతో యజమానులు మామిడి తోటలను ఎక్కువగా కౌలుకు ఇస్తుంటారు. వారు కొంత డబ్బును ముందుగా యజమానులకు ఇచ్చి, పంట పూర్తిగా చేతికి రాగానే మిగతా డబ్బును అందిస్తారు. జిల్లాలో సరైన మార్కెటింగ్ సౌకర్యం లేని కారణంగానే నాగ్పూర్కు వెళ్లి మామిడి కాయలు అమ్ముకోవాల్సి వస్తోందని పలువరు రైతులు చెబుతున్నారు.


