అశ్రునయనాల మధ్య అంత్యక్రియలు
బెల్లంపల్లి: సిద్దిపేట జిల్లా కొండపాక వద్ద రాజీవ్రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడి మృతిచెందిన భార్యాభర్తలు ఎండీ అబ్దుల్ రఫీ, ఫర్జానాలకు ఆదివారం బెల్లంపల్లిలో అశ్రునయనాల మధ్య అంత్యక్రియలు జరిగాయి. సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులు అంబులెన్స్లో మధ్యాహ్నం బెల్లంపల్లిలోని పోస్టాఫీసుబస్తీకి తీసుకువచ్చారు. ఇద్దరు కొడుకులు, కూతురు రోదించిన తీరు అందరిని కంటతడి పెట్టించింది. వృద్ధాప్యంలో ఉన్న రఫీ తల్లి షాజాతిబీ గుండెలవిసేలా రోదించారు. బంధువులు, బస్తీవాసులు, అబ్దుల్ రఫీతో కలిసి పనిచేసిన పలువురు సింగరేణి కార్మికులు తరలివచ్చి నివాళులర్పించారు. మున్సిపల్ చైర్ పర్సన్ దావ స్వాతి, కాంగ్రెస్ నాయకులు ముచ్చర్ల మల్లయ్య, దావ రమేశ్, నాతరి స్వామి, బండి ప్రభాకర్, నయీమ్, బండి రాము, కౌన్సిలర్లు మత్తమారి రాయమల్లు, మేడి పున్నం చంద్రు, మైనార్టీ నాయకులు.. రఫీ మృతదేహంపై పూలమాల వేసి కాంగ్రెస్ జెండా కప్పి శ్రద్ధాంజలి ఘటించారు. రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యుడు రేణికుంట్ల ప్రవీణ్, మాజీ కౌన్సిలర్ ఎలిగేటి శ్రీనివాస్ తదితరులు భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. బాబుక్యాంపు బస్తీలోని ఖబరస్తాన్లో కుటుంబ సభ్యులు అంత్యక్రియలు పూర్తిచేశారు.


