హాస్టల్ ఎదుట విద్యార్థుల ఆందోళన
మంచిర్యాలఅర్బన్: నిబంధనలకు విరుద్ధంగా హాస్టల్ సిబ్బంది తమతో పనులు చేయిస్తున్నారని ఆరోపిస్తూ పట్టణంలోని సాయికుంట సమీకృత బాలుర వసతి గృహ విద్యార్థులు ఆదివారం గేటు ఎదుట బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఏఐఎస్బీ జిల్లా ప్రధాన కార్యదర్శి సన్నీగౌడ్ మాట్లాడుతూ విద్యార్థులతో టిఫిన్లు, వంటలు చేయిస్తున్నారని ఆరోపించారు. పనులు చేయనివారిపై బెదిరింపులకు పాల్పడుతున్నారన్నారు. వార్డెన్ సెలవులో ఉండడంతో సంబంధిత అధికారుల హమీ మేరకు ఆందోళన విరమించారు. విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని పీడీఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి తిరుపతి వేర్వేరు ప్రకటనలో డిమాండ్ చేశారు.
విద్యార్థుల ఆరోగ్యం, సంక్షేమానికి ప్రాధాన్యం
మంచిర్యాలఅర్బన్: సంక్షేమ వసతి గృహాల్లో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థుల ఆరోగ్యం, సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తున్నామని జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ అధికారి భాగ్యవతి అన్నారు. ఆదివారం స్థానిక బీసీ బాలుర సమీకృత వసతి గృహం ఎదుట ఆందోళన నేపథ్యంలో హాస్టల్ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ హాస్టల్ స్థాయిలో పర్యవేక్షణ, సమన్వయంలో తాత్కాలిక లోపం కారణంగా భోజన సరఫరా, ప్రాథమిక సౌకర్యాలలో అంతరాయం కలిగిందని గమనించామని, కలెక్టర్ ఆదేశానుసారం దిద్దుబాటు చర్యలు చేపడ్తామన్నారు. భవిష్యత్లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు.


